ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు విస్తృత ఆదరణ లభిస్తుంది. అందులో మరి ముఖ్యంగా మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది మహిళలను లబ్ధిదారులుగా మారుస్తుంది.
ఇప్పుడు ఈ లబ్ధిదారుల ఖాతాలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి భాగమయ్యారు. చంద్రబాబు నాయుడి నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో ఉన్న భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువు వద్ద జలహారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు గాను శాంతిపురం నుండి తుమ్మిసి వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసారు.
తనదగ్గరున్న ఆధార్ కార్డు చూపించి ఒక సాధారణ మహిళ మాదిరి ఫ్రీ టికెట్ పొందారు భువనేశ్వరి. దీనితో రాష్ట్రంలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకానికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టయ్యింది.
తన ఈ ప్రయాణంలో భువనేశ్వరి బస్సులోని ఇతర మహిళలతో మాటామంతి చేస్తూ రాష్ట్రంలో కూటమి పాలన మీద ప్రభుత్వ పథకాల మీద వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే తమతో పాటుగా ముఖ్యమంత్రి సతీమణి ఆర్టీసీ లో ప్రయాణం చేయడంతో బస్సులోని ఇతర ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. భువనేశ్వరి ఫ్రీ టికెట్ తీసుకున్న ఫోటోలు, ఆ బస్సులో ప్రయాణించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే గత ఐదేళ్లు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పరదాల చాటున తిరిగితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సామాన్య వాలంటీర్ మాదిరి పేద ప్రజల తలుపు తడుతూ వారి కుటుంబంతో మమేకమవుతూ కబుర్లు చెపుతున్నారు.
ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి సతీమణి ఒక సాధారణ మహిళ మాదిరి ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం చేస్తూ రాష్ట్రంలో మహిళలకు దక్కుతున్న సంక్షేమ పథకాలను సొంతగా తెలుసుకుంటున్నారు, ఇతరులకు తెలియచేస్తున్నారు.







