టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు… మనసు మాత్రం వైసీపి వైపే?

pawan-kalyan-chandrababu-naidu-jagan-narendra-modi

బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో… ఆ పార్టీ కోసం టిడిపి, జనసేనలు ఎందుకు అన్ని సీట్లు త్యాగాలు చేశాయో అందరికీ తెలుసు. కేంద్ర ఎన్నికల కమీషన్‌ చేత ఈసారి ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించేలా చేస్తుందనే ఏకైక కారణంతోనే పొత్తు పెట్టుకున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమీషన్‌ తీరు చూస్తే అటువంటి చర్యలు ఏవీ చేపట్టిన్నట్లు కనిపించడం లేదు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘గాజు గ్లాసు’ను పోలిన బకెట్, మగ్గువంటి గుర్తులను రెబెల్ అభ్యర్ధులకు కేటాయించడమే ఇందుకు నిదర్శనం.

ADVERTISEMENT

నిజానికి టిడిపి బీజేపీని మద్యలో విడిచిపెట్టేసినా పవన్‌ కళ్యాణ్‌ మాత్రం బీజేపీతోనే కొనసాగారు. పైగా టిడిపి, బీజేపీ పొత్తులు కుదుర్చుకున్నాక బీజేపీ కోసం జనసేన సీట్లను త్యాగం చేశారు అందుకు ఇప్పుడు జనసేన తిరుగుబాటు అభ్యర్ధులతో తీవ్ర ఇబ్బంది పడుతోంది కూడా.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఈసారి 8 సీట్లు గెలుచుకోవడానికి ఆ పార్టీ తరపున పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రచారం కూడా ఓ కారణమే. బీజేపీ కోసం ఇంత చేసిన మిత్రపక్షం జనసేనకు కీలకమైన ఎన్నికలలో నష్టం జరుగుతుంటే, కేంద్రం పట్టించుకోవడం చూస్తే, బీజేపీతో పొత్తులు, దాని కోసం సీట్ల త్యాగాలు రెండూ వృధాయే అని అనిపించకమానదు. అలాగే కేంద్ర ఎన్నికల కమీషన్‌ చేత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలనే టిడిపి చిన్న ఆశ కూడా కేంద్రం తీర్చలేకపోతోంది. అంటే టిడిపి త్యాగాలు కూడా వృధాయే అని అనుకోవలసి వస్తోంది.

రాష్ట్ర బీజేపీ నేతలలో కొందరు పట్టుబట్టి టికెట్స్ సంపాదించుకున్నప్పటికీ మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో ఆ సీట్లు వైసీపి గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

ఆనాడు మహాభారతంలో శకుని, శల్యుడు, కురు వృద్ధులు అందరూ కూడా దుర్యోధనుడు వైపే ఉన్నారు. దుర్యోధనుడి కోసమే చివరివరకు పోరాడారు కూడా. కానీ వారందరూ పాండవులే గెలవాలని కోరుకున్నారు. చివరికి గెలిపించారు కూడా.

అలాగే మోడీ, అమిత్ షాలు కూడా టిడిపి, జనసేనల వైపే ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ, రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు, పరిణామాలు చూస్తే వారిద్దరి మనసులు జగన్‌వైపే ఉన్నట్లు అనుమానం కలుగుతుంది.

ఎందుకంటే, వారికి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనేది ముఖ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏపీలోని 25 మంది ఎంపీలు ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం ఒక్కటే వారికి ముఖ్యం కనుక అని అనుకోవలసి వస్తుంది!

ADVERTISEMENT
Latest Stories