వైకాపా ఎంపీల రాజీనామాలకు స్పీకరు సుమిత్రా మహాజన్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈరోజే ఆమోదం తెలపొచ్చు లేకపోతే 10 రోజుల విదేశీపర్యటన పూర్తి అయ్యాక ఆమోదించవచ్చు అని మీడియా సమాచారం. ఎప్పుడు ఆమోదం తెలిపినా ఉపఎన్నికలు రాకపోవచ్చు అని లోక్ సభ సచివాలయ సిబ్బంది అంటున్నారు. ఐదుగురు వైకాపా ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు సమర్పించినప్పటికీ వాటి ఆమోదం స్పీకరు సంతకం పెట్టిన తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు.
వాస్తవానికి 16వ లోక్సభ మే 18వ తేదీన ఏర్పడింది. దాని తొలి సమావేశం జూన్ 4న జరిగింది. వాస్తవానికి లోక్సభ ఏర్పడిన నాటి నుంచి లెక్కించి ఏడాదిలోపు సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశముంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండదని లోక్సభ సచివాలయ సిబ్బంది అభిప్రాయపడ్డారు. కానీ మరికొందరు లోక్సభ తొలి సమావేశం తేదీ నుంచి ఏడాదిలోపు ఉండాలని చెప్పడంవల్లే ఆమె తన నిర్ణయాన్ని జూన్ 4 తర్వాతకు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ఏడాది కాలానికి ఎవరు ఎలాంటి నిర్వచనం ఇచ్చుకున్నా ఉప ఎన్నికలకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే స్పీకరు జూన్ 4వ తేదీ తర్వాత రాజీనామాలకు ఆమోద ముద్ర వేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. దీనితో ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా ఉపఎన్నికలు రాకుండా జాగ్రత్త పడింది అని సమాచారం. అయితే ఇది కేవలం బీజేపీ పనా లేక వైకాపా కూడా కేంద్రంలో ఈ మధ్య వచ్చిన కొత్త పరిచయాలతో అలా సెట్ చేసుకుందా అనేది వివాదాంశం.



