ఎన్నికల ప్రచారంలో కాదు.,రాష్ట్రానికి అండగా నిలబడితేనే!

Modi Amith Shah

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడడంతో ఇక బీజేపీ పార్టీ పెద్దలంతా రాష్ట్రంలో ప్రచారానికి ఒక్క్కొక్కరుగా క్యూలో నిలబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ.సీఎం యోగి ఆదిత్యనాధ్, అస్సాం.సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ ఇలా పలువురు బీజేపీ పెద్దలు తెలంగాణ రాష్టానికి రానున్నారు.

కేవలం అయితే ఐదేండ్లకొక్కసారి వచ్చే ఎన్నికల కోసమే పార్టీ తరుపున ప్రచారానికి వచ్చి తమ పార్టీకే అధికారం కట్టబెట్టమని ఓట్లడిగితే అటువంటి రాజకీయ పార్టీ నేతలను ప్రజలు విశ్వసిస్తారా? తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశబ్దం గడిచినా అప్పటి నుంచి అధికారంలో ఉన్న బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఎన్నో సమస్యలలో ఒక్కదానికి కూడా ఇప్పటివరకు పరిష్కారం చూపలేక పోయింది. అలాగే విభజన హామీలు నెరవేర్చలేక పోయింది.

ADVERTISEMENT

రెండు రాష్ట్రాలకు రావలసిన ప్రాజెక్టులు, నిధులు అన్నిటిని అటకెక్కించి ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి ఓటడుగుతాం అంటే ఎలా కుదురుతుంది. తమను ఎదిరించిన వారిపై పగ సాధించడానికి ప్రత్యర్థులతో సైతం చేతులు కలిపి లోపాయికారి ఒప్పందాలతో రాష్ట్ర రాజకీయాలనే గబ్బు పట్టిస్తున్నారు బీజేపీ అధినాయకత్వం. ఏపీలో ఒక తీరుగా తెలంగాణలో మరో తీరుగా వ్యవహరిస్తూ కేవలం రాష్ట్రంలో రాజకీయాలు మాత్రమే చేస్తాం రాష్ట్రానికేమి చేసేదేలేదు అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడు మాత్రం ప్రజలు తమ పార్టీ వైపే నిలబడాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా?

ఎన్నికల సమయం దాటిన తరువాత కనీసం పొత్తు పెట్టుకున్న పార్టీ అధినేతకు సైతం సమయం ఇవ్వలేని బీజేపీ అధిష్టానం ఇక ఓటేసిన ప్రజల గోడు పట్టించుకుంటుందా?గతంలో ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నిక బరిలో నిలిచి కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు మరికొన్ని మంత్రి పదవులు తీసుకుని ప్రభుత్వంలో భాగస్వామి అయ్యికూడా ఏపీ కి రావాల్సిన నిధులు ఇవ్వలేదు, ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ అందిచనూలేదు సరికదా పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలతో పోరుకి సిద్దమయ్యి ప్రస్తుత ఏపీ పరిస్థితికి సాక్షిగా మిగిలింది బీజేపీ అధిష్టానం.

తెలంగాణ రాష్ట్రంలో అయినా అదే పరిస్థితి ఎప్పుడు ఎవరి పార్టీతో అధికార పొత్తుకు సిద్దమవుతుందో ఏ పార్టీతో అనధికార పొత్తులో మునుగుతుందో చెప్పలేని పరిస్థితి. వరుస పెట్టి అధినాయకులు రాష్ట్రంలో ప్రచారానికి దింపితే సరిపోదు ఆ రాష్ట్రానికి రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అన్ని సమస్యలను పక్షపాతం లేకుండా పరిష్కరించి, నిరంతరం ప్రజల సమస్యల మీద ప్రభుత్వంతో పోరాడితే ప్రజలే దగ్గరుండి గద్దెనెక్కిస్తారు అనేది బీజేపీ అధిష్టానం తెలుసుకుంటే బాగుంటుంది.అప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలపై ఐటీ దాడులు, ఈడీ దాడులు జరపాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories