సమకాలీన రాజకీయాలలో అపరచాణక్య అని కీర్తింపబడుతున్న అమిత్ షాకు కాంగ్రెస్ గట్టి షాక్ ఇచ్చింది. కర్ణాటక ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేసారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
[m9ad]
పార్టీ నేతలు తన గెలుపునకు కృషి చేయలేదని, ప్రచారం కూడా నిర్వహించకుండా తననో బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికలో తాను జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అనితా కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
చెన్నపట్నం, రామ్నగర స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన హెచ్డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన రామనగర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనితా కుమారస్వామి గెలుపు నల్లేరు మీద నడకే కానుందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక లోని రెండు పార్లమెంట్ స్థానాల ఉపఎన్నికలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.



