బీజేపీ మౌనం టిడిపి, జనసేనలకు అవమానమేగా!

Chandrababu-Naidu-Narendra-Modi-Amit-Shah-Pawan-Kalyan

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి మూడు వారాలవుతోంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఎన్డీయే కూటమిలో చేరమని తమని ఆహ్వానించారని, రాష్ట్ర అవసరాల దృష్ట్యా అదే మంచిదని తాము భావిస్తున్నామని,” చెప్పారు.

ADVERTISEMENT

అంటే ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తుందని చెప్పిన్నట్లే భావించవచ్చు. కనుక ఆ పార్టీతో సీట్ల సర్దుబాట్ల కోసం ఆలస్యం అవుతోందని అందరూ భావించారు. కానీ ఈ విషయం తేల్చుకోవడానికి మూడు వారాల సమయం అవసరం లేదు. అయినా బీజేపీ అధిష్టానం పొత్తుల విషయంలో మౌనం వహిస్తుండటం, ఆ రెండు పార్టీలకు అవమానంగానే భావించాల్సి ఉంటుంది.

ఇదివరకు చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మోడీ, అమిత్ షాలు ఇలాగే మౌనం వహించి పరోక్షంగా జగన్‌ నిర్ణయానికి తమ ఆమోదం ఉందని చెప్పకనే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదేవిదంగా టిడిపిని ఎన్డీయేలోకి రావాలని ఆహ్వానించిన తర్వాత పొత్తుల విషయంలో బీజేపీ మౌనం వహిస్తూ అవమానిస్తోంది.

కనుక బీజేపీ ఊగిసలాటకు కారణం టిడిపి, జనసేనలు అది అడిగినన్ని సీట్లు ఇవ్వకపోవడమా లేక జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన ఏదో ఆఫర్ వలన?అనే ప్రశ్నకు బీజేపీయే సమాధానం చెప్పాలి.

టిడిపి, జనసేనలు సంయమనం పాటిస్తూ 175కి 118 స్థానాలకు మాత్రమే తమ అభ్యర్ధులను ఖరారు చేసుకుని బీజేపీ కోసం ఎదురుచూస్తున్నాయి. బీజేపీని కలుపుకుపోవడం కోసం ఆ పార్టీ పెద్దలతో చివాట్లు కూడా తినాల్సివచ్చిందని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చెప్పుకున్నారు.

ఏపీలో బలమే లేని బీజేపీతో పొత్తు కోసం టిడిపి, జనసేనలు ఇన్ని అవమానాలు భరించాలా?అని వాటి నేతలు, కార్యకర్తలు, అభిమానులు అడుగుతుంటే వారికి జవాబు చెప్పుకోవడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.

బీజేపీ మౌనం లేదా ఊగిసలాట గమనిస్తే ఓ విషయం అర్దమవుతుంది. ఆ పార్టీ పెద్దలకి ఆంధ్రప్రదేశ్‌ సమస్యలు, అవసరాలు, ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలు, ఎంపీ సీట్ల లెక్కలే ముఖ్యమని భావిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న బీజేపీని నమ్ముకుని టిడిపి, జనసేనలు లాభపడకపోయినా పర్వాలేదు కానీ నష్టపోకుండా ఉంటే అంతే చాలు.

ADVERTISEMENT
Latest Stories