2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రెండు పార్టీల రాజకీయ భవిష్యత్ కి, ఇద్దరు నేతల రాజకీయ ప్రస్థానానికి సవాల్ గా మారాయి. అలాగే దేశంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
వై నాట్ 175 అంటూ తలరెగరేస్తున్న వైసీపీ ని రాజకీయంగా తలదన్ని ఐదేళ్ల తమ అవమానాలకు, ఐదేళ్ల అమరావతి అరణ్యరోదనకు ముగింపు పలకడానికి “సైకో పోవాలి సైకిల్ రావాలి” అంటూ బాబు – “హలో ఏపీ బై బై వైసీపీ” అంటూ పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ పవన్, అమరావతిని తిరిగి పునర్నిర్మిస్తాను అంటూ బాబు మొదలు పెట్టిన ఈ రాజకీయ ఎన్నికల కురుక్షేత్రంలో 151 తో వైసీపీ ని కూటమి 11 తో కట్టడి చేసారు. అయితే వీరి ఈ కలయిక యొక్క రాజకీయ లక్ష్యాలు పూర్తి గా సఫలం అయాయ్యి, మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిన ఈ కూటమి ఆ దిశగా లక్ష్యాలను అందుకుందా అనేది ఇప్పుడు చుద్దాం.
వైసీపీ హయాంలో అరణ్యరోదన చేసిన రాష్ట్ర రాజధాని అమరావతి కూటమి రాకతో తిరిగి పట్టాభిషేకం జరుపుకుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్ ఉభయసభలలో చట్టబద్దత పొందింది. అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి ప్రగతికి అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం ద్రుష్టి కేంద్రీకరించింది.
బిట్స్ వంటి ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయాలు అమరావతి వైపు అడుగులేశాయి. అలాగే క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీ కి అమరావతిని కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మార్చారు. ఇక విశాఖ కేంద్రంగా టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్స్ వంటి AI, ఐటీ టెక్నాలజీ ని అభివృద్ధి చేస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జులై నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. అలాగే పుట్టపర్తి ని AMCA ఫైటర్ జెట్ల తయారీ కేంద్రంగా మార్చారు. ఇక చిట్టూరి జిల్లా తడ శ్రీ సిటీ లో పరిశ్రమలు కొలువుతీరుతున్నాయి. అలాగే మెగా డిఎస్సి తో వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కలిపించారు.
అభివృద్ధి విషయాలు ఇలా ఉంటే ఇక సంక్షేమం సంగతి చూస్తే తల్లికి వందనం, మహళలకు ఉచిత బస్సు, ఒకటవ తేదీకే రూ. 4000 పెన్షన్, రూ. 5 లకే పేదవాడి కడుపు నింపే అన్న కాంటీన్ వంటి కార్యక్రమాలతో కూటమి ముందుకెళ్తుంది. అలాగే ఏపీ ప్రభుత్వ అధికారిక ముద్రతి రైతులకు పాస్ పుస్తకాలను జారీ చేసింది.
ఇక పవన్ బాధ్యతలు తీసుకున్న పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించి ఏపీ దేశంలోనే మొదటి స్థానం లో నిలిచింది. ఇక విద్యా శాఖ మంత్రి లోకేష్ ఏపీ విద్యా వ్యవస్థలో అనేక కీలక మార్పులు చేసారు. విద్యార్థులకు చదువు తో పాటుగా ఆటలు ఉండాలని ప్రతి శనివారం ను ‘నో బ్యాగ్ డే’ గా ప్రకటించారు.
ఇలా కూటమి అటు అభివృద్ధి విషయంలోనూ ఇటు సంక్షేమం విషయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశ గానే అడుగులు వేస్తుంది. ఇక రాజకీయంగా గమనిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ల మధ్య ఈ రెండేళ్ల పాలనా సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా పార్టీ అధినేతలుగా బాబు, పవన్ ఒక్క మాట మీదే నిలబడుతున్నారు, పార్టీ క్యాడర్ ని దారికి తెస్తున్నారు. ఇక బీజేపీ అధిష్టానం సైతం బాబు, పవన్ కు తగిన ప్రాధాన్యం ఇస్తూనే వస్తుంది.
ఇక వైసీపీ విషయంలో మాత్రం కూటమి ఇప్పటికి మెతకవైఖరే అనుసరిస్తుంది అనేలా నడుచుకుంటుంది. వైసీపీ నిత్యం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతుంటే ప్రభుత్వ పెద్దలు ఆ బురద కడుక్కునే పనిలోనే ఉంటున్నారు కానీ వైసీపీ నోటిని కట్టడి చేయలేకపోతున్నారు అనే అభిప్రాయం ఇప్పటికి సర్వత్రా వినిపిస్తూనే ఉంది. మరి ఆ విషయంలో కూడా కూటమి దూకుడుగా ముందుకెళ్లగలుగుతుందా లేదా అనేది చూడాలి..!





