సినీ పరిశ్రమలో నూతన నటీనటులను పరిచయం చేస్తే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ విశ్లేషణ చేసారు. సదరు కధనం ప్రకారం… ఇటీవల కాలంలో పేరున్న నిర్మాణ సంస్థలు స్టార్ హీరోల కంటే కూడా నూతన నటీనటులతో సినిమాలు నిర్మించేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీనికి గల కారణాన్ని విశ్లేషించిన దరిమిలా… నూతన నటీనటులతో నిర్మించిన సినిమాలు హిట్టా? ఫట్టా? అన్న విషయం పక్కన పెడితే, వారితో కుదుర్చుకునే ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాల వరకు నిర్మాణ సంస్థకు రాబడి వస్తూనే ఉంటుందని సమాచారం.
ఈ పద్ధతిని ప్రముఖ దర్శక, నిర్మాత ఆదిత్యా చోప్రా బాలీవుడ్ లో తొలుత ప్రవేశపెట్టారట. దీంతో యశ్ రాజ్ ఫిల్మ్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలు నూతన తారలతో సినిమాలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఆదిత్యా చోప్రా ప్రవేశపెట్టిన పధ్ధతి ప్రకారం సినీ పరిశ్రమకు పరిచయం చేయాలంటే… సినిమాల్లో వారు ప్రవేశించిన తరువాత అయిదు సంవత్సరాల వరకు వారి సంపాదనలో 20 శాతం సదరు నిర్మాణ సంస్థకు చెల్లిస్తూ ఉండాలనే నిబంధన ఉందట.
సదరు నిబంధనను అగ్రిమెంట్ లో ముందుగానే పేర్కొంటారని, ఈ 20 శాతం నిబంధన కేవలం సినిమాల విషయంలోనే కాకుండా ప్రకటనలు, లైవ్ షోలు, డ్యాన్స్ షోలు, ప్రత్యేక కార్యక్రమాలు… ఇలా అన్నిటి నుంచి వారి సంపాదనలో 20 శాతం నిర్మాతకు చెల్లించుకోవాలట. 2012లో బాలీవుడ్ కు యశ్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా పరిచయం చేసిన అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ ల నుంచి భారీగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఈ ముగ్గురూ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ తో సినీ పరిశ్రమకు కొత్త రక్తం రావడానికి అవకాశం ఉండనుండగా, మరో వైపు నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లో ఉంటారన్నది అసలు వాస్తవం.



