టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా(మహేశ్వర రావు)పై సాక్షి మీడియాలో వరుస కధనాలు ప్రసారం చేస్తోంది. గత ఎన్నికలలో వైసీపి ప్రభంజనంలో కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు. కానీ ఈసారి వైసీపి ప్రభంజనం లేకపోగా ఎదురుగాలి వీస్తోంది.
కనుక టిడిపి ముఖ్యనేతలను ఎదుర్కొని ఓడించడం ఇంకా కష్టం. కనుక వారిపై బురద జల్లుతూ తమ మీడియాలో కధనాలు ప్రసారం చేస్తుంటే, ఎన్నికలలో ఓడించవచ్చనే దురాలోచన కనిపిస్తోంది.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమా భూకబ్జాలకు పాల్పడ్డారని, గూండాయిజం చేశారంటూ సాక్షి మీడియా కధనాలు ప్రసారం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన విజయవాడలో ప్రెస్మీట్ పెట్టి, జగన్ ప్రభుత్వానికి సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు.
ఒకవేళ నేను 2014-2019 వరకు భూకబ్జాలు, రౌడీయిజం చేసిన్నట్లయితే, గత 58 నెలలుగా అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం నాపై కేసులు నమోదు చేయకుండా ఎందుకు ఊరుకుంది? ఇప్పుడు నేను ఎమ్మెల్యేను కూడా కాను…మా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కారు.
ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేతిలోనే సర్వాధికారాలు, పోలీస్ యంత్రాంగం అన్నీ ఉన్నాయి కదా?మీరు అధికారంలోకి రాగానే నాపై కేసు నమోదు చేసే అవకాశం మీకే ఉంది కదా?కానీ ఇంతకాలం మౌనంగా ఉండి, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మోరిగిన్నట్లు, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు నాపై సాక్షి మీడియా చేత ఎందుకు బురద జల్లిస్తున్నారో నాకు తెలియదా?నాపై ఈ ఆరోపణలు చేసిన సాక్షి మీడియా కూడా నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి,” అంటూ బోండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను కబ్జాలు, దందాలు, రౌడీయిజం చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలలో అధికారంలో ఉన్న మీరు నా మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? pic.twitter.com/LlvNvMenH6
— Bonda Uma (@IamBondaUma) February 18, 2024




