ప్రతీ రాజకీయ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాము చాలా ప్రాధాన్యం ఇస్తామని, మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు వారికే కేటాయిస్తున్నామని చెప్పుకుంటాయి. కాగితాల మీద ఆ లెక్కలు చూస్తే నిజమే అని నమ్మక తప్పదు.
కానీ ఎన్నికలలో కోట్లు ఖర్చు పెట్టగలవారే అసలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలని దాదాపు అన్ని పార్టీలు నిర్ధారించేశాయి. కనుక అలా ఖర్చుపెట్టగల మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పుత్ర రత్నాలకు, కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ న్యాయం చేస్తోందని గట్టిగా సమర్ధించుకుంటాయి.
వైసీపి విడుదల చేసిన మూడు జాబితాలను నిశితంగా గమనించిన్నట్లయితే ఇది మరింత స్పష్టమవుతుంది. ఉదాహరణకు బీసీ (కాపు) మంత్రి బొత్స సత్యనారాయణ బీసీల కోసం ఏమి చేశారో ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన కుటుంబం భారీగా ఆస్తులు సంపాదించుకుంది. అయినా వారు బీసీల కిందే లెక్క! పదవులు అనుభవిస్తున్న బొత్స కుటుంబం వలన బీసీలందరికీ కాకపోయినా కనీసం కాపులకు అయినా ఏమైనా మేలు జరిగిందా?అంటే లేదనే చెప్పాలి.
బీసీ కోటాలోనే బొత్స సత్యనారాయణ భార్య బొత్స సత్యనారాయణ ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఖరారు చేశారు. విశాఖ బీసీ (కాపు)ని నిలబెట్టడం ద్వారా టిడిపి, జనసేనలకు చెక్ పెట్టాలనేదే జగన్ వ్యూహమని అర్దమవుతూనే ఉంది.
ఆమె గెలుపు కోసం బొత్స సత్యనారాయణ ఖర్చుకు వెనకాడరు. కనుక ఆమె ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. టికెట్లు పంపకాలలో అన్ని పార్టీలకీ ఇదే లెక్క తప్ప నిజంగా బడుగు బలహీన వర్గాల నుంచి రాజకీయంగా ఎదుగుతున్నవారిని గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తున్నామా లేదా?అని అలోచించే పరిస్థితిలో లేవనే చెప్పాలి.
ఈ సందర్భంగా వైసీపికి రాజీనామా చేస్తున్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ (బీసీ) చెప్పిన విషయాన్ని ఓసారి తప్పక గుర్తు చేసుకోవలసి ఉంటుంది.
“వైసీపిలో బీసీలకి పెద్ద పీట వేశామని చెప్పుకొంటారు. అది జస్ట్ ఓ జనరల్ స్టేట్మెంట్ మాత్రమే. పెద్ద పీట వేయడమంటే ఏదో ఓ పదవి ఇచ్చి పక్కన కూర్చొబెట్టడమే అని వారు భావిస్తుంటారు. బీసీలకి పెద్ద పీట వేశామని ప్రజలకు చెప్పుకోవడానికే తప్ప వైసీపిలో మాకు, మా మాటకు ఎటువంటి విలువ, గౌరవం లేవు. జగన్ అనుమతి లేకుండా నేను నా నియోజకవర్గంలో ఏ పనీ చేయకూడదు. ఒకవేళ సిఎంని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. వైసీపిలో బీసీలకు ఇచ్చే విలువ, గౌరవం ఇదే. ఈ మాత్రం దానికి మాకు ఈ పదవులు దేనికి?” అని అన్నారు.
అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు, పదవులు ఇచ్చినా పార్టీలో సముచిత స్థానం, గౌరవం లభించవని అర్దమవుతోంది. అంటే పార్టీలో వారికి గౌరవం ఉండదు. వారి వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఎటువంటి లాభమూ ఉండదని స్పష్టమవుతోంది.
కనుక వందలో… వేలో కోట్ల ఆస్తులు పోగేసుకొన్నవారే అసలైన బడుగు బలహీనవర్గాలన్న మాట! వారికి, వారి పుత్రరత్నాలకు టికెట్లు, పదవులు ఇస్తే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరిగిపోయిన్నట్లే అన్న మాట!




