వైసీపి సీనియర్ నేతలలో వైవీ సుబ్బారెడ్డి కూడా ఒకరు. పైగా జగన్కు బంధువు. అత్యంత ఆత్మీయుడు. కనుక జగన్కు తెలియకుండా ‘హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా చేయాలనే’ కొత్త ప్రతిపాదన చేయరు. కనుక ఇది కూడా జగన్ వ్యూహమే అని భావించవచ్చు.
తెలంగాణ ఎన్నికలలో ఓడిపోయి రేవంత్ రెడ్డిని ఎదుర్కొలేక తడబడుతున్న బిఆర్ఎస్ పార్టీకి, లోక్సభ ఎన్నికలకు ముందు ‘సెంటిమెంట్’ రాజేసుకునేందుకే వైవీ చేత ఈ మాట అనిపించి ఉండవచ్చు. ఊహించిన్నట్లే వైవీ ఈ మాట అన్న కొద్ది సేపటికే “తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడం వలన పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేస్తోందంటూ…” బిఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ పాట మొదలుపెట్టేశారు.
అయితే వైవీ చేత ఈమాట అనిపించి తెలంగాణలో కేసీఆర్కు సాయపడవచ్చని అనుకుని ఉండవచ్చు. కానీ దీంతో ఏపీలో తమ ప్రభుత్వం, పార్టీ పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతుందని వైసీపి పండితులు కాస్త ఆలస్యంగా గ్రహించిన్నట్లున్నారు.
ఒకవేళ ఈ చర్చ ఇంకా కొనసాగితే టిడిపి, జనసేనలు అందిపుచ్చుకొని మాట్లాడటం మొదలుపెడితే వైసీపికి మరింత నష్టం కలుగుతుంది. కానీ దాని అదృష్టం కొద్దీ సీట్ల సర్దుబాటు హడావుడితో చాలా బిజీగా ఉన్న టిడిపి, జనసేనలు, జగన్ మనసులో మాటని వైవీ సుబ్బారెడ్డి బయటపెట్టినా పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ముందు జాగ్రత్తగా మంత్రి బొత్స సత్యనారాయణ చేత ఖండన ప్రకటన చేయించారు. “వైవీ ఈవిదంగా అని ఉండకపోవచ్చు… ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నారో గ్రహించకుండా ఆయన మాటలను మీడియా వక్రీకరించి ఉండొచ్చు… హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేదే కానీ చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయం కారణంగా చేజార్చుకున్నాము. ఏపీకి ఈ దుస్థితి (రాజధాని లేకపోవడం)కి కారణం చంద్రబాబు నాయుడే. రాజధాని విషయంలో మా పార్టీ వైఖరి ఎప్పుడో చెప్పాము. నేటికీ మేము దానికే కట్టుబడి ఉన్నామని,” బొత్స సత్యనారాయణ అన్నారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు హైదరాబాద్నే ఏపీ రాజధానిగా కొనసాగించి ఉండి ఉంటే, రెండు రాష్ట్రాల ప్రజల మద్య ఇంకా దూరం పెరిగి ఉండేది. ముఖ్యంగా ఏపీకి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా చేయలేకపోయేవారు.
కానీ ఆరోజు ఆయన ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు కనుకనే అమరావతిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు కనబడుతున్నాయి. ఒకవేళ జగన్ కూడా అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేసి ఉండి ఉంటే నేడు నగరానికి రూపు రేఖలు వచ్చేవి. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు పనిచేస్తాయనే చక్కటి సందేశం పెట్టుబడిదారులకు ఇచ్చిన్నట్లయ్యేది. దాంతో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తరలివచ్చేవి.
కానీ చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత ద్వేషంతో అమరావతిని పాడుబెట్టేశారు. ఈ ఐదేళ్లలో మూడు రాజధానులు కాదు కదా… జగన్ ప్రభుత్వం కనీసం విశాఖని కూడా రాజధానిగా చేయలేక చేతులెత్తేసింది. కనీసం జగన్ విశాఖకు మకాం మార్చలేకపోయారు.
కనుక ఎన్నికలలో రాజధాని అంశంపై ప్రతిపక్షాలు నిలదీస్తే జగన్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చెప్పుకోలేదు కూడా. చెప్పుకునే ప్రతీ మాట వైసీపి ఓటమికి కారణం అవుతుంది. కనుక ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు రాజధాని ప్రస్తావన చేయకూడదని ఆ ప్రభువునే వేడుకోవలసి ఉంటుంది.




