ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో మార్పులు చేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వైసీపీ నాయకులు. ఇక పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలో త్యాగాలు, కొన్ని స్థానాలలో మార్పులు చేయాల్సిందే అనే విధంగా ముందుకెళ్తున్నారు టీడీపీ శ్రేణులు.
అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు బడా నాయకుల మధ్య పోరుకి ఈ 2024 ఎన్నికలు సాక్ష్యంగా నిలవనుందా..? అంటే ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఆలోచనలో ఉందనే చెప్పాలి. విజయనగరం జిల్లా చీపురుపల్లి బొత్స కుటుంబానికి కంచు కోటనే చెప్పాలి. 2004 నుంచి 2014 ఎన్నికలు మినహాయిస్తే 2019 ఎన్నికల వరకు బొత్స చీపురుపల్లిలో తన పట్టు నిలుపుకున్నారు.
అయితే 2014 విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో బొత్స పై విజయం సాధించారు. 2024 ఎన్నికలలో కూడా బొత్సను ఓడించడానికి టీడీపీ తరుపున అంతే బలమైన నాయకుడిని బరిలో దింపాలనే భావనలో ఉంది టీడీపీ అధినాయకత్వం.
ఇందులో భాగంగా గత ఎన్నికలలో జగన్ వేవ్ ను కూడా తట్టుకుని విశాఖ నార్త్ అసెంబ్లీలో టీడీపీ తరుపున గెలిచిన గంట శ్రీనివాస్ ను ఈసారి చీపురుపల్లి నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు గంట వ్యాఖ్యానించారు. గతంలో ప్రజారాజ్యం తరుపున అనకాపల్లి నుండి పోటీ చేసి గెలుపొందిన గంట టీడీపీ తరుపున భిమిలీ, చోడవరం నుంచి కూడా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు.
ఇలా, పార్టీల మార్పు..,స్థాన చలనం జరిగినప్పటికీ గంట తన పట్టు నిలుపుకుంటూనే ఓటమి ఎరుగని నాయకుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బొత్సకు ఇటువంటి సీనియర్ లీడర్ తో చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం గంటను చీపురుపల్లి కాన్స్టెన్సీ నుంచి బరిలోకి దింపాలని భావిస్తోందట. ఒక ఎమ్మెల్యే గా మంత్రిగా ఉంటూ రాష్ట్ర రాజధానిని సమాధులతో పోల్చిన బొత్సకు ఈసారి రాజకీయ సమాధి కట్టాలనే దృఢ నిశ్చయంతో ఉంది టీడీపీ.
దీనిపై గంట స్పందిస్తూ నా ముందు టీడీపీ అధిష్టానం ఈ ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవమే. అయితే దీనిపై నేను ఆలోచిస్తున్నా,ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదు.ఇన్నాళ్లుగా విశాఖ పరిధిలో పోటీ చేస్తూ వస్తున్న నేను ఇప్పుడు చీపురుపల్లి అంటే విజయనగరం జిల్లా దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.
అక్కడ స్థానిక పరిస్థితులను చూసి అక్కడి పార్టీ కార్యకర్తలతో చర్చించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని త్వరలోనే తుది నిర్ణయాన్ని హై కమాండ్ కు తెలియచేస్తా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు మాజీ మంత్రి గంట. దీనితో ఈసారి చీపురుపల్లిలో ”బొత్స మేడలో టీడీపీ గంట కొట్టగలరా”..? అంటూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.




