తెలంగాణ శాసనసభ ఎన్నికలు సామాన్యులకి అర్దంకానీ ఓ పద్మవ్యూహంలా మారాయి. బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుకొంటున్నప్పటికీ, ఒక దానితో మరొకటి కుమక్కు అయ్యాయనే వాటి వాదనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం, తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడంతో మూడు పార్టీల మద్య రాజకీయ చదరంగం మొదలైందని చెప్పొచ్చు.
బిఆర్ఎస్, బీజేపీలలో కామన్ ఏమిటంటే రెంటికీ కాంగ్రెస్ పార్టీయే శత్రువు. తెలంగాణలో తమ అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నందుకు కేసీఆర్ దాంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బీజేపీ, ఇప్పుడు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, మిజోరాం రాష్ట్రాలలో కాంగ్రెస్ను ఢీకొంటోంది. వీటిలో రెండు మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయినా, దేశంలో కాంగ్రెస్ మళ్ళీ బలపడుతోంది. బీజేపీ బలహీనపడుతోందనే టాక్ కార్చిచ్చులా దేశమంతా వ్యాపిస్తుంది. మోడీ ప్రభుత్వానికి కీలకమైన లోక్సభ ఎన్నికలకు ముందు ఇది ఎంతమాత్రం మంచిది కాదు.
తెలంగాణలో బీజేపీ ఎలాగూ గెలవలేదని స్పష్టమవుతోంది కనుక కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీకి సహకరిస్తోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కేసీఆర్ సూచనల ప్రకారమే కాంగ్రెస్ గెలుపు గుర్రాల ఇళ్ళు, కార్యాలయాలపై కేంద్రం ఐటి దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఐటి దాడులు చేయిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధులు ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకోగలిగితే చాలు… వారిని సులువుగా ఓడించవచ్చని బిఆర్ఎస్ భావిస్తున్నట్లు ఉందని మీడియాలో వస్తున్న విశ్లేషణలు నిజమే అనిపిస్తాయి.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్రంలో రైతుబంధు నిధుల విడుదలని నిలిపివేయించింది. కానీ ఇప్పుడు మరో 4 రోజులలో పోలింగ్ జరుగబోతుంటే రైతుబంధు నిధుల విడుదలకి అనుమతించింది!
ఇన్ని రోజులు నిలిపి ఉంచిన ఈసీ మరో 5 రోజులు ఎందుకు నిలిపి ఉంచలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేసీఆర్ సూచన మేరకే కేంద్రం ఈసీని ఒప్పించి, ఆయనను గెలిపించేందుకు తోడ్పడుతోందని కాంగ్రెస్ వాదనలను కొట్టిపడేయలేము.
చివరిగా ఒక్క విషయం చెప్పుకోవాలి. కేసీఆర్ని గెలిపించడం కోసమో లేదా కాంగ్రెస్ను ఓడించడం కోసం తెలంగాణ బీజేపీ అభ్యర్ధులను బలి చేసుకొంటోంది కదా?కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీని బలి చేసుకొంటునప్పుడు, రేపు ఏపీలో మాత్రం బలిచేసుకోకుండా ఉంటుందా?




