తెలంగాణలో కాంగ్రెస్‌ సగం విజయం సాధించిన్నట్లేనా?

Telangana-Congress

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. ఇదివరకు కేసీఆర్‌, బిఆర్ఎస్‌ మంత్రుల నోట నిత్యం బండి సంజయ్‌, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు కేసీఆర్‌తో సహా అందరి నోట పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాహుల్ గాంధీల పేర్లే వినిపిస్తుండటం గమనిస్తే, కాంగ్రెస్‌ అప్పుడే సగం విజయం సాధించిన్నట్లే భావించవచ్చు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పధకాలను పోలిన పధకాలనే బిఆర్ఎస్‌ కూడా ప్రకటించడం గమనిస్తే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ తమకు గట్టి పోటీ ఇస్తోందని కేసీఆర్‌ అంగీకరించిన్నట్లే భావించవచ్చు.

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో రొటీన్ హామీలతో పాటు నిరుద్యోగ యువతను ఆకట్టుకొనేందుకు ‘జాబ్ క్యాలండర్’ ప్రకటించింది. దీనిని కాంగ్రెస్‌ నేతలు తమ ప్రచారంలో హైలైట్ చేసుకోగలిగితే ఇది ఎన్నికలలో ‘గేమ్ చేంజర్‌’ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ నేతలు ఇది గ్రహించారో లేదో కానీ మంత్రి కేటీఆర్‌ గ్రహించారు. అందుకే ఆయన వెంటనే స్పందిస్తూ తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తుందని ప్రకటించారు.

ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో టిఎస్‌పీఎస్సీ రద్దు చేయాలని లేదా సమూలంగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్‌, బీజేపీలు చేసిన డిమాండ్లను అప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఆ హామీని చేర్చగానే కేటీఆర్‌ కూడా టిఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని నిన్న ప్రకటించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఎన్నికలకు వరకు సాగదీస్తూ బిఆర్ఎస్‌ పార్టీకి లబ్ధి కలిగించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. కనుక తమ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ఫాలో అవుతామని, రెండేళ్ళుగా సాగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆరేడు నెలల్లో ముగించి అందరికీ నియామక పత్రాలు అందజేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దీంతో దీనిపై కూడా మంత్రి కేటీఆర్‌ హడావుడిగా స్పందించాల్సి వచ్చింది.

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ ఇంకా కొత్త కొత్త హామీలు ప్రకటిస్తుండటం గమనిస్తే, కాంగ్రెస్‌ అప్పుడే సగం విజయం సాధించిన్నట్లే భావించవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌కు 20 సీట్లకు మించి రావని కేసీఆర్‌ ఈరోజు ఖమ్మం సభలో చెప్పారు.

అయితే కాంగ్రెస్‌తో కేసీఆర్‌, బిఆర్ఎస్‌ నేతలు ఇంత ఒత్తిడికి గురవుతుండటమే ఈసారి బిఆర్ఎస్‌కు సీట్లు తగ్గి కాంగ్రెస్‌ పార్టీకే ఎన్నో కొన్ని పెరుగబోతున్నాయని స్పష్టమవుతోంది. అయితే రెంటిలో దేనికి ప్రభుత్వం ఏర్పాటుకి సరిపడా (60) సీట్లు వస్తాయనేది డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడిన రోజున తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories