ఏపీ, తెలంగాణ రాజకీయాలలో ఎన్నికల ఫలితాలతోనే తొలి విస్పోటనాలు జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీ దీపావళి టపాసులు కాలుస్తూ అవి కూడా పెను విస్పొటనాలే అనుకుంటున్నాయి. కానీ కల్వకుంట్ల కవిత బహిష్కరణ-ప్రెస్మీట్లతో బీఆర్ఎస్ పార్టీలో నిజమైన విస్పోటనం జరిగింది.
కానీ ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. క్లస్టర్ బాంబుల్లా వరుస ప్రేలుళ్ళు తప్పవు. బీఆర్ఎస్ పార్టీ ఆ ధాటికి తట్టుకొని నిలబడగలదా లేదా? అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపిలను దెబ్బ తీసి, ప్రతిపక్ష నేతలను ఉక్కుపాదంతో అణచివేసినందుకే కేసీఆర్ ఇప్పుడు ఈ కర్మ ఫలం అనుభవిస్తున్నారన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మాట అక్షరాల నిజమే అనిపిస్తుంది. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో చచ్చిందన్నట్లుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.
చంద్రబాబు నాయుడుని తొక్కేద్దామనుకున్న జగన్, అక్కడ రేవంత్ రెడ్డిని తొక్కేదామనుకున్న కేసీఆర్లకు వారి సొంత కుటుంబ సభ్యులే ‘గజమాల’ వంటి భారీ రిటర్న్ గిఫ్టులు ఇవ్వడం మరో విశేషం.
కానీ కొండంత దేవుడికి ఓ నూలుపోగు అంటే ఎలా?కనుక అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఉడతా భక్తిగా కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ, మద్యం కుంభకోణం కేసులని రిటర్న్ గిఫ్టుగా సమర్పించుకున్నారు. వాటిని కేసీఆర్, జగన్ అయిష్టంగానైనా స్వీకరించక తప్పడం లేదు.
కానీ ఈ రెండు పార్టీల అధ్యాయాల సారాంశం చూస్తే కొన్ని విషయాలు అర్ధమవుటాయి.
1. చెడపకురా చెడేవు.
2. కర్మ ఫలం అనుభవించక తప్పదు.
3. జగన్, కేసీఆర్ల కంటే వారి బాధితులే అదృష్టవంతులు.





