బీఆర్ఎస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కేటీఆర్, ఇక్కడ జగన్ ఎల్లప్పుడూ ‘త్రీ రోజస్ టీ’లా షిక్కటి షిర్నవ్వులతో కనిపించేవారు.
అక్కడ కేసీఆర్ కాంగ్రెస్, బిజేపి నేతలను సన్నాసులు, పనికి దద్దమ్మలంటూ ఎద్దేవా చేస్తుంటే అందరూ సంతోషంగా నవ్వుకునేవారు. చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ నుంచి తరిమి కొట్టానని కేసీఆర్ బక్కపలుచని జబ్బలు చరుచుకుంటుంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకునేవారు.
ఇక్కడ ఏపీ అసెంబ్లీలో కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులు చంద్రబాబు నాయుడు.. అయన కుటుంబ సభ్యులపై రెచ్చిపోతుంటే, జగన్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకునేవారు.
ప్రధాని మోడీని కుర్చీలో నుంచి లాగి పక్కన పడేస్తానని, కాంగ్రెస్, బిజేపిలను బంగాళాఖాతంలో విసిరేస్తానన్నప్పుడు ఒకటే చప్పట్లు. అవి ఆయన ప్రతాపం చూశా లేక ఉత్తరకుమార ప్రగల్భాలనా? ఎవరికీ డౌట్ రాలే!
అలాగే ఇక్కడ ‘నేను లేని సమయంలో పోలీసులు చంద్రబాబు నాయుడుని లేపేశారని’, ‘పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్లు పెళ్ళాలను మారుస్తారంటూ’ జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేస్తున్నప్పుడు చప్పట్లే చప్పట్లు… అప్పుడూ ఆ చప్పట్లు దేనికని ఎవరికీ డౌట్ రాలే!
ఆ పాలాభిషేకాలు, పూర్వ వైభవం తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. హాయిగా నవ్వుకొని ఎంతకాలం అయ్యిందో.. కనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు నేడు మాక్ అసెంబ్లీ నిర్వహించుకొని సిఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్ మంత్రులను మనసారా ఎద్దేవా చేస్తూ హాయిగా నవ్వుకున్నారు. ఇలాగైయినా అందరి బీపీ, షుగర్ లెవెల్స్ కొంచెం తగ్గి ఆరోగ్యాలు కాస్త మెరుగుపడతాయి కదా?
బీఆర్ఎస్, వైసీపీల రాజకీయ ఫార్మాట్ అంతా సేమ్ టూ సేమ్ కనుక దాని స్పూర్తితో వైసీపీ కూడా ‘175 మంది ఎమ్మెల్యేలతో’ మాక్ అసెంబ్లీ నిర్వహించుకునే అవకాశం ఉంది.
ఎందుకంటే హాయిగా… మనసారా నవ్వుకొని చాలా కాలమే అయ్యిందిగా.. మళ్ళీ ఎప్పటికైనా అవకాశం వస్తుందో రాదో?





