కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం కోరుకున్నట్లే ఉంటాయి కనుక.
వైసీపీ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు డబ్బు పంచిపెట్టాము కనుక అందరూ గొర్రెల్లా తమ వెంట నడుస్తారని, గుడ్డిగా తమ పార్టీకే ఓట్లు వేస్తారనుకోవడం ఓ భ్రమ.
పాలకడలి నుంచి అమృతం, కల్పతరువు, కామధేనువు వగైరా పుట్టుకొచ్చినట్లు, ఆ భ్రమల్లో నుంచే 175/175, చొక్కా మడత పెడదాం, కాలర్ ఎగరేద్దాం, యుద్ధం.. సిద్ధం వంటివి పుట్టుకొచ్చాయి.
కానీ టీడీపీతో జనసేన, బీజేపీల పొత్తు అనే వాస్తవాన్ని, దాని భవిష్యత్ పరిణామాలను వైసీపీ బాగానే గుర్తించింది. చివరకు కూర్చున్న సీఎం కుర్చీయే ఎడారిలో ఒయాసిస్సులా ఊరిస్తూ చంద్రబాబు నాయుడు చేతికి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి మళ్లీ ‘రప్పారప్పా’, ‘మావిగన్’ వంటి కొత్త భ్రమలు సృష్టించుకొని సంతోషపడుతున్నారు. వైసీపీ అల్ప సంతోషాన్ని ఎవరు మాత్రం కాదంటారు? కనుక ‘డీఎస్సీలో అవకతవకలు’ అంటూ రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు.
కోర్టు కేసులలో వైసీపీకి ఉన్న అపార అనుభవం మరే పార్టీకి లేదు. కనుక ఒకవేళ డీఎస్సీలో నిజంగా అవకతవకలు జరిగినట్లు వైసీపీ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే, హైకోర్టులో ఓ పిటిషన్ వేసి కూటమి ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చవచ్చు. అవకతవకలకు పాల్పడినట్లు రుజువు చేసి, డీఎస్సీ నియామకాలను రద్దు చేయించవచ్చు. చట్ట ప్రకారం ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకునేలా చేయవచ్చు. కానీ శాంపుల్ కోసం ఒకరిని కోర్టుకు పంపితే మొట్టికాయలు పడటంతో మళ్లీ ఆ ఆలోచన చేయలేదు.
అయితే తాను చేపట్టిన రాష్ట్రానికి మూడు రాజధానులన్నట్లే, ‘డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయంటూ’ రికార్డు వేస్తూనే ఉన్నారు.
దీని గురించి ప్రశ్నిస్తున్న గొంతులను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని జగన్ ఆరోపించారు. తమ సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినంత మాత్రాన ప్రజల గొంతు నొక్కేయలేరని జగన్ తేల్చి పడేశారు.
ఇదివరకు అధికారంలోకి రాగానే అన్నిటినీ రద్దు చేసినట్లు, ఎలాగూ ‘ఈసారి మనమే అధికారంలోకి’ అంటున్నారు కనుక ఈసారి వస్తే డీఎస్సీ నియామకాలన్నింటినీ రద్దు చేసేస్తామని చెప్పుకోవచ్చు కదా? కానీ లోకేష్ రాజీనామా చేయాలి.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ కాలక్షేపం చేయడం దేనికి?
అంటే ఉపాధ్యాయులు స్కూల్లో పిల్లలకు పాఠాలు బట్టీ వేయించి, పరీక్షల్లో వాటిని గుర్తుపెట్టుకొని రాసి పాస్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే వైసీపీ కూడా ప్రజలను మాస్ హిప్నటైజ్ చేసి ‘డీఎస్సీలో అవకతవకలు’ జరిగాయని నమ్మించగలిగితే చాలు.. వారు ఆ ట్రాన్స్లో ఉండి వైసీపీకి ఓట్లు వేసేస్తారని కావచ్చు.
కానీ చిన్న సందేహం. ఇది వాస్తవమా.. భ్రమా? ఏదైతే మనకెందుకు.. ఈసారి మనమే అనుకుంటే పోలా!





