కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫామ్హౌసులో పడుకుంటే ‘అది గోడకున్న తుపాకీ.. ఎప్పుడో అప్పుడు పేలుతుంది,’ అని సమర్ధించుకుంటారు.
ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వకపోతే శాసనసభకు రానని మారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్యాలస్లో నుంచి కాలు బయటపెడితే సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంలో అందరూ భయంతో గజగజ వణికిపోతుంటారని వైసీపీ నేతలు సమర్ధించుకుంటారు. కానీ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు మాత్రం రారు.
జగన్ కనీసం ఓ సాకు చూపుతున్నారు. కానీ కేసీఆర్ అలాంటి సాకు కూడా చూపడం లేదు. ఏమంటే అయన ముఖ్యమంత్రిగానే మళ్ళీ శాసనసభలో అడుగుపెడతారని కేటీఆర్ ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
శాసనసభ సమావేశానికి వచ్చి తనని ఎదుర్కోవాలని అయన కంటే వయసులో, అనుభవంలో చిన్నవారైన సిఎం రేవంత్ రెడ్డి పదేపదే సవాలు చేస్తున్నారు. లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి. కానీ రాకుండా జీత భత్యాలు ఎందుకు తీసుకుంటున్నావు? సిగ్గనిపించడం లేదా? అని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే బహిరంగంగా నిలదీస్తున్నా కేసీఆర్ స్పందించరు.
కనీసం అయన సూచనల మేరకు పనిచేసే కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలైనా ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ‘నీ మొహానికి ఆయనెందుకు? మా ఎమ్మెల్యేలు చాలు,’ అంటూ తెలివిగా జవాబు చెప్తుంటారు.
సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. కనుక నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగుతోంది. కనుక కేటీఆర్, హరీష్ రావుతో సహా అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
పదవీ అధికారం ఉంటే తప్ప శాసనసభకు రానని మొండికేసి, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించేసినప్పుడు, మళ్ళీ వారికి కేసీఆర్ మార్గదర్శనం అవసరమా? బయట ఎలాగు వారిరువురూ కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డిని బాగానే ఢీ కొంటున్నారు కదా? కేసీఆర్ చెప్తే తప్ప వారు శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేరా?
అదేవిధంగా ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణకు జగన్మోహన్ రెడ్డి కంటే రాజకీయాలలో, పాలనలో చాలా అనుభవం ఉంది. అలాంటి సీనియర్కు జగన్ మార్గదర్శకత్వం అవసరమా?అనిపిస్తుంది.





