టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నేడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసూ తీర్పు చెప్పింది. ధర్మాసనంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ చంద్రబాబు నాయుడు న్యాయవాదుల వాదనలో ఏకీభవిస్తూ అనుకూలంగా తీర్పు చెప్పగా, జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకంగా తీర్పు చెప్పారు.
జస్టిస్ జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏమన్నారంటే, ఈ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసే ముందు ఏపీ సీఐడీ తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధి కనుక ఏపీ సీఐడీ చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుంది.
జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే, ఈ కేసులో చంద్రబాబు నాయుడుకి 17ఏ వర్తించదు. అవినీతి నిరోధక శాఖలోని ఈ చట్ట సవరణ (2018)లో జరిగింది కనుక దానిని వర్తింపజేయాలనడం సరికాదు. అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగులను వేదించకుండా అడ్డుకునేందుకే 17ఏ ఉంది. కనుక ఇది ఈ కేసుకు వర్తించదు.
ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందున ఈ కేసుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రిఫర్ చేస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పుడు జగన్ ప్రభుత్వం కేవలం రాజకీయ దురుదేశ్యంతో, కక్షపూరితంగానే ఈ కేసు నమోదు చేసిందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.
కేసు నమోదు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడిన్నట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపకుండా, 17ఏ ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా, కనీసం ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా నమోదు చేయకుండా అరెస్ట్ చేసిందని వాదించారు. ఇవన్నీ రాజకీయ దురుదేశ్యం, కక్ష సాధింపులను సూచిస్తున్నాయని వాదించారు.
ఈ కేసుపై ఇరు పక్షాలు సుదీర్గ వాదనల తర్వాత అక్టోబర్ 20వ తేదీన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు అదే కేసుపై తీర్పు వెలువరించింది. అయితే ఇరువురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ కేసు చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్ళింది. బహుశః ముగ్గురు లేదా ఐదుగురు న్యాయమూర్తులతో మరో ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీర్పు చెప్పడంతో, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని వైసీపి ఆత్మసాక్షి అప్పుడే ఓ పెద్ద కధనం వండి వార్చేసింది. చంద్రబాబు నాయుడు కేసులో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించే ఆత్మసాక్షి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వివరాలను ఎందుకు ప్రచురించదో?
ఈ కేసులో తుది తీర్పు వెలువడేవరకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందే చెప్పింది. కనుక ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడుని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం లేదనే చెప్పవచ్చు. ఈ విషయం మాత్రం ఆత్మసాక్షి చెప్పనే లేదు!




