ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలలో ఉన్నది ఇద్దరే నాయకులు కాగా, మూడవ వ్యక్తి త్వరలో రంగప్రవేశం చేస్తానని స్పష్టం చేసారు. అంటే ఏపీ రాజకీయాలన్నీ ఈ ముగ్గురి చుట్టే తిరగనున్నాయన్న విషయం ఖరారైంది. ఈ ముగ్గురిలో చంద్రబాబు, జగన్ లది చెరో దిక్కు అన్న విషయం బహిరంగమే కాగా, పవనే ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అన్న విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ పవన్ తికమకలో జగన్ మీడియా కూడా డోలాయమానంలో పడిపోతోంది.
‘ప్రతిపక్షం’తో కలిసి చేయడానికి సిద్ధమన్న పవన్ వ్యాఖ్యలు వారికి ఊరటనిస్తుంటే… అధికార పక్షాన్ని సమర్ధించే విధంగా చేసిన ‘వారికుండే ఇబ్బందులు వారికుంటాయి’ అన్న వ్యాఖ్యలతో పవన్ పై మండిపడుతోంది. జగన్ ధోరణి ఇలా ఉంటే… అదే జగన్ వలన తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా ‘జనసేన’ అధినేత వద్ద చంద్రబాబు తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీకి ప్రతిష్టాత్మకంగా భావించే పోలవరం, అమరావతి నిర్మాణాలకు అడ్డుపుల్లలు వేస్తున్నట్లుగా తన గోడును పవన్ వద్ద వెలిబుచ్చుకున్నారని సమాచారం.
రాజధాని నిర్మిస్తున్నది తానొక్కడినే ఉండేందుకన్నట్టు ప్రవర్తిస్తున్నారని చెప్పిన చంద్రబాబు, ఇటువంటి విపక్షం ఏ రాష్ట్రంలోనూ లేదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దాదాపు గంట పాటు ఏకాంతంగా భేటీ అయి పలు విషయాలను వీరిద్దరూ చర్చించుకోగా, కాపులకు రిజర్వేషన్ నుంచి నంద్యాల ఎన్నికల వరకూ పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కొత్త రాష్ట్రాన్ని సగర్వంగా నిలిపేందుకు తాను అనునిత్యమూ కష్టపడుతుంటే, విపక్షాలు తనపై కక్షతో అడ్డుకుంటున్నాయని చంద్రబాబు బాధపడ్డట్లుగా విశ్వసనీయ సమాచారం.
అలాగే వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తేవాలని భావిస్తే, వద్దని లేఖలు పంపారని, తమపై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా అభివృద్ధికి అడ్డుపడటం ఏంటని… పోలవరం పూర్తయ్యే లోపే నీరివ్వాలన్న ఉద్దేశంతో పట్టిసీమను తలపెడితే, అది రాకుండా ఎన్నో చేశారని పవన్ తో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు సచివాలయాన్ని నిర్మించిన తరువాత పవన్ తొలిసారిగా అమరావతికి రాగా, స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికిన చంద్రబాబు, ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు.


