
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు నేడు. అది ఒక అంకె మాత్రమే తప్ప దాంతో తనకు సంబందమే లేదన్నట్లు ఇంత వయసులో కూడా రోజుకి 14-16 గంటలు పని చేస్తుంటారు.
Also Read – అప్పులిస్తాం.. మా ఆయుధాలు కొనుకొని యుద్ధం చేసుకోండి!
ముఖ్యమంత్రి బాధ్యతలతో క్షణం తీరిక లేకపోయినా, ఆ కార్యక్రమాలలోనే సామాన్య ప్రజల ఇళ్ళకు వెళ్ళి మరీ వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. సిఎం చంద్రబాబు నాయుడు జీవితం తెరిచిన పుస్తకం వంటిది. దానిలో ప్రతీ విషయం ప్రజలందరికీ తెలుసు.
కనుక అవన్నీ చెప్పుకోవడం కంటే ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుంటే, చిన్న చిన్న సమస్యలు, కష్టాలకు క్రుంగిపోయే వారికి కూడా స్పూర్తిదాయకంగా ఉంటుంది.
Also Read – విరాట్ టెస్ట్ రిటైర్మెంట్..?
సవాళ్ళను, సమస్యల నుంచి గుణాపాఠాలు నేర్చుకుంటూ వాటి నుంచే అవకాశాలు వెతుక్కోవాలని చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు చెపుతుంటారు. చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపారు కూడా.
ఎన్టీఆర్ చేతుల్లో నుంచి టీడీపీని తన చేతుల్లోకి తీసుకోవడానికి లక్ష్మీ పార్వతి ప్రయత్నిస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలని కూడగట్టి వారి మద్దతుతో తన చేతుల్లోకి తీసుకున్నారు.
Also Read – MIM : ఇస్లాం పేరు పలికే అర్హతే పాక్ కు లేదు…
ఈవిదంగా చేస్తే నమ్మక ద్రోహం చేశారని, మామకు వెన్నుపోటు పొడిచారని జీవితాంతం నిందలు మోయాల్సివస్తుందని అప్పుడే సన్నిహితులు చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు. ఆ నిందలు భరిస్తూ ప్రజల నమ్మకం పొందడం చాలా కష్టమని చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు.
కానీ పార్టీని, దానిపై ఆధారపడున్న వేలాదిమంది నేతలు, లక్షలాది మంది కార్యకర్తలను కాపాడుకోవడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. పార్టీని కాపాడుకున్నారు. మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తెస్తూనే ఉన్నారు. అలాగే నేటికీ ఆ నిందలు మోస్తూనే ఉన్నారు!
ఆనాడు పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు అంత సాహసం చేశారు గాబట్టే నేడు టీడీపీ కనిపిస్తోంది.. ఆయనే పూనుకోకుండా ఉంటే?
రాష్ట్ర విభజన ఆయనకు మరో పెద్ద అగ్నిపరీక్ష పెట్టింది. కేసీఆర్ తనలక్ష్య సాధన కొరకు చంద్రబాబు నాయుడు, ఆంధ్రా పాలకులను దోపీడీ దొంగలుగా అభివర్ణిస్తూ తెలంగాణ ప్రజలలో వారిపట్ల తీవ్ర ద్వేషం రగిలించినప్పుడు, తెలంగాణలో టీడీపీని కాపాడుకోవడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.
అయినప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా టీడీపీ గౌరవ ప్రధమైన సీట్లు సాధించిందంటే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓటుకి నోటు కేసుతో చంద్రబాబు నాయుడు రాజకీయంగా సమాధి చేసి అడ్డుతొలగించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. ఆయనని కాపాడటం ఆ బ్రహ్మతరం కూడా కాదని ప్రగల్భాలు పలికారు. కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టడంతో కేసీఆర్ సైలంట్ అయిపోయారు.
రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పుడు ఆయన చాలా నిబ్బరంగా పాలన సాగిస్తూ ఒక్కో సమస్య పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని ఏవిదంగా మళ్ళీ గాడిన పెట్టారో అందరికీ తెలుసు.
చేతిలో చిల్లిగవ్వ లేని ఆ సమయంలోనే లక్షల కోట్లు పెట్టుబడి అవసరమైన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులని సిఎం చంద్రబాబు నాయుడు ఏవిదంగా హ్యాండిల్ చేశారో అందరూ చూశారు.
సమస్యలన్నీ పరిష్కరించి వడ్డించిన విస్తరిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందిస్తేనే జగన్ దానిని కుక్కలు చించిన విస్తరిలా చేశారు. అదే.. ఆనాడు చంద్రబాబు నాయుడుకి బదులు జగన్ ముఖ్యమంత్రి అయ్యుంటే?ఏం చేసేవారు? ఎలా చేసేవారు?ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా మారేది?అని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు విలువ ఏమిటో అర్దమవుతుంది.
2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళపాటు చంద్రబాబు నాయుడుకి, టీడీపీ ముఖ్య నేతలకు, కార్యకర్తలకు జగన్ నరకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. అవహేళనలకు, అవమానాలకు అంతే లేదు. చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ ముఖ్య నేతల ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి టీడీపిని సమూలంగా తుడిచి పెట్టేయాలని జగన్ చేసిన ప్రయత్నాలను అందరూ చూశారు.
చంద్రబాబు నాయుడు జీవితంలో అత్యంత దురదృష్టకరమైనది జైల్లో గడపడటం. తనని మానసికంగా, ఆరోగ్యపరంగా క్రుంగిపోయేలా చేసేందుకు కొన్నిరోజులు చీకటి గదిలో బందించి ఉంచారని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన సంగతి అందరికీ తెలుసు.
ఈ వయసులో ఈ అవమానాలు, వేధింపులు భరించడం అవసరమా?అని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆనాడే దణ్ణం పెట్టేసి రాజకీయ సన్యాసం తీసుకునేవారు. కానీ ఆ అటువంటి పరిస్థితులను కూడా చాలా నిబ్బరంగా ఎదుర్కొంటూ పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకున్నారు. మళ్ళీ గెలిపించుకొని అధికారంలోకి వచ్చారు.
గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా రాష్ట్రం పరిస్థితి గొప్పగా ఉందా?అంటే లేదు. జగన్ చేసిన అప్పులు, నిర్వాకం వలన రాష్ట్రం పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చింది. అయినా తన అనుభవం, తెలివితేటలు, రాజకీయ పలుకుబడి అన్నిటినీ ఉపయోగించి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడుతున్నారు కదా?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ దార్శనికుడుగా వ్యవహరిస్తారు. రాష్ట్రాభివృద్ధి కోసం తపిస్తుంటారు. పదవీ, అధికారం కోల్పోతే ఇంట్లో కూర్చొని బాధపడుతూ రాష్ట్రాన్ని, ప్రజలని, పార్టీని గాలికొదిలేయారు. అలుపెరుగని పోరాట యోధుడులా మారి విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటారు.
ఆయన ఓర్పు, పట్టుదల, పోరాట స్పూర్తి రాజకీయాలలో ఉన్నవారికే కాదు.. నేటి యువతకి కూడా స్పూర్తిదాయకమే కదా?
75 ఏళ్ళ యువకుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరపున https://www.m9.news/ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.