టీడీపీని వీడి వైకాపాలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నాలకు బ్రేక్ వేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. ఆనం చర్యల వల్ల జరగబోయే నష్టాన్ని నివారించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనను ఏకాకిని చేసి ఆయన వర్గాన్ని తెలుగు దేశం వైపు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగి. అసంతృప్తి నేతలను బుజ్జగించే పనులు మొదలు పెట్టారు. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉండగా, మరోవైపు ఒక్కొక్కరిగా ఆయనకు నమ్మకస్తులైన వారు జారిపోతున్నారు.
పార్టీ మారుతున్న దృష్ట్యా ఆనం తెలుగుదేశానికి నష్టం చేసే అవకాశం ఉందనే విషయాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ పరిధిలో ఆనం వెంట నడిచే అవకాశం ఉన్న మండల, గ్రామ స్థాయి నాయకులను కలిసి వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.



