చైనాలో అద్భుతమైన నిర్మాణాలు అతి తక్కువ వ్యవధిలో రూపుదిద్దుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. చైనా పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు ఆ విశేషాలను చెప్తూ… ఏపీ బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మనకంటే ముందుగానే చైనాలో సంస్కరణలు మొదలయ్యాయని.., మన దగ్గర పట్టణాలు డిమాండ్ తో ఏర్పడుతున్నాయని.., కానీ అవి డిజైన్ ప్రకారం ఏర్పడాలని అన్నారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత నాతో మాట్లాడుతూ.., చైనాలో 50 అంతస్తుల భవనాన్ని కేవలం 30 రోజుల వ్యవధిలో నిర్మించారని… అలాంటి సామర్థ్యంతో భవనాలు నిర్మించే వెసులుబాటు మీకు కూడా ఉందని ప్రధాని తనతో చెప్పినట్లుగా చంద్రబాబు చెప్పారు. విపరీతంగా పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చు అన్నారు.
డ్రోన్స్, రోబోటిక్స్, హైస్పీడ్ రైళ్లు ఇలా ఎన్నో సాంకేతిక సౌకర్యాలు చైనాకు అందుబాటులో ఉన్నాయని… వీటన్నింటినీ వినియోగించుకున్న చైనా స్పీడ్, స్కిల్, స్కేల్ కు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. అందుకే అమరావతి అభివృద్ధిలో చైనా కంపెనీలకు భాగస్వామ్యం కల్పించామని, మనదేశంలో సుమారు 500 చైనా కంపెనీలు ఉన్నాయని… చైనా నుంచి పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని అన్నారు.
కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు చైనా కంపెనీ ముందుకు వచ్చిందని… అలాగే సైబర్ సెక్యూరిటీ కోసం ఓ అవగాహన చేసుకున్నామని పెట్టుబడుల విశేషాలను తెలిపారు. త్వరలో చేయనున్న సర్వేతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజల ప్రతి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుందని చెప్పారు. గతంలో తానూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మాదిరి, ప్రస్తుతం కూడా ఏపీలో చాలా జరుగుతోందని, అది ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని… తన గత అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చి, ఏపీకి వచ్చిన సందర్భంగా మొదటి ప్రశ్నగా… “మీరు వస్తారో రారో అన్న అనుమానంతో నేను పిలవలేదు కదా, అయినా మీరెలా వచ్చారని” అడిగానని… దానికి బిల్ క్లింటన్ జవాబు చెప్తూ… అమెరికాలోని పలు ప్రధాన పత్రికల్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూశానని, అప్పుడే ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని భావించానని, అందుకే వచ్చానని చెప్పారని… ఆ తరువాత బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ఏపీకి వచ్చారని, ఆయనను కూడా తాను అదే ప్రశ్న అడిగానని… దానికి ఆయన సమాధానమిస్తూ, ‘ఇండియాలో దట్ ఈజ్ మోస్ట్ హేపెనింగ్ ప్లేస్, యూ షుడ్ సీ’ అని బిల్ క్లింటన్ తనకు చెప్పారని, అందుకే ఏపీకి వచ్చానని తనతో అన్నారని చంద్రబాబు తెలిపారు.



