టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అయితే బిజెపి పెద్దలను కలిసేందుకు కాదు. కేంద్ర ఎన్నికల కమీషన్(సీఈసీ)ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఓట్ల తొలగింపు, వాటి స్థానంలో దొంగ ఓటర్లను చేర్చడంపై ఫిర్యాదు చేయడానికి వెళుతున్నారు.
ఇప్పటికే టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి సీఈసీని కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అవకతవకలను సాక్ష్యాధారాలతో సహా సమర్పించి, లిఖితపూర్వకంగా పిర్యాదులు చేశారు. ఆ తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘంలో చలనం వచ్చింది. సీఈసీ ఆదేశం మేరకు ఉరవకొండ ఓటర్ల జాబితాలో అవకతవకలకు బాధ్యుడైన స్థానిక ఎన్నికల అధికారిపై వేటు వేసింది.
అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయని టిడిపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదులు చేస్తున్నా వాటిని పట్టించుకోకపోవడంతో, ఈసారి చంద్రబాబు నాయుడే టిడిపి ముఖ్యనేతలను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్ళి సీఈసీకి ఫిర్యాదు చేయబోతున్నారు.
ఓటర్ల జాబితాలలో అవకతవకలను సాక్ష్యాధారాలతో సహా సేకరించేందుకు టిడిపి కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించి, రాష్ట్ర వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయో సాక్ష్యాధారాలను సేకరింపజేస్తున్నారు. వాటన్నిటినీ సీఈసీకి సమర్పించి, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఇప్పుడే అప్రమత్తమై కీలకమైన ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేయించే ప్రయత్నం చేయడం మంచి ఆలోచనే. లేకుంటే ఎన్నికల గంట మ్రోగేలోగా రాష్ట్రంలో టిడిపి ఓటర్లందరినీ వైసీపీ ప్రభుత్వం తొలగించినా ఆశ్చర్యం లేదు. ఎన్నికల గంట మ్రోగిన తర్వాత ఓటర్ల జాబితాలో మార్పులకు సీఈసీ కూడా అనుమతించదు.
వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లు గెలుచుకొంటామని, సంక్షేమ పధకాలే తమని గెలిపిస్తాయని సిఎం జగన్మోహన్ రెడ్డి పదేపదే చెపుతుంటారు. అది ఇలాగేనా?అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. గెలుస్తామని అంత ధీమా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అవకతవకలు ఎందుకు పాల్పడుతోందని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తునప్పటికీ వారికి ఓటమి భయం పట్టుకొందని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తూ కాదనగలరా?



