టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా..’ సభలతో ప్రజల మద్యకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, మరోపక్క టిడిపి యువనేత నారా లోకేష్ ‘శంఖారావం’ సభలలో జగన్ ప్రభుత్వం తీరుని ఎండగడుతున్నారు.
ప్రకాశం జిల్లా, పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగిన ‘రా కదిలి రా..’ సభలో చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని గురించి రోజుకో మాట మాట్లాడుతున్న జగన్ ప్రభుత్వం తీరుని నిశితంగా విమర్శిస్తూ, “గత ఎన్నికలకు ముందు అమరావతి మన రాజధాని అని జగన్ అన్నాడు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులు అవసరం అన్నాడు.
మళ్ళీ మాట మార్చి విశాఖ ఒక్కటే మన రాజధాని అన్నాడు. మరో రెండు నెలల్లో ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దిగిపోబోతుంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పాట అందుకున్నాడు. ఇంతకీ ఏపీకి ఎన్ని రాజధానులున్నాయి? ఎక్కడ ఉన్నాయి?
ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే, ఐదేళ్ళలో ఒక్క రాజధాని ఏర్పాటు చేయలేకపోయాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నాడు.
హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని మనం అక్కడే ఉండిపోయి ఉంటే, ఈ అమరావతిని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయేవాళ్ళం కదా?జగన్ అధికారంలోకి రాగానే అమరావతి పనులు కొనసాగించి ఉండి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది. ఖచ్చితంగా ఇంత దుస్థితిలో ఉండేది కాదు.
కానీ జగన్కు కూల్చడమే తప్ప ఏదీ నిర్మించడం చాతకాదు కనుక ఈ ఐదేళ్ళు అదే పనిలో ఉండిపోయి, ఎన్నికలకు ముందు ఇప్పుడు మేల్కొని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పాట మొదలుపెట్టాడు.
తెలంగాణ వాళ్ళని ఏమని అడుగుతాము? మా ముఖ్యమంత్రి ఓ చాతకానివాడు. ఐదేళ్ళలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాము. కనుక హైదరాబాద్లో మళ్ళీ ఇంత చోటిస్తే ఓ పక్కన సర్ధుకుపోతామని అడుగుతారా?
అడుకుంటే ఎవరైనా ఇంత బిచ్చం వేస్తారేమో కానీ ఆస్తిలో వాటా రాసి ఇవ్వరు కదా?” అంటూ చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం తీరుని నిశితంగా విమర్శించారు.
మరో రెండు నెలల్లో టిడిపి, జనసేనల ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమరావతి రాజధాని పనులను మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా ఉంటుందని, చేస్తామని ఇంత స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. కానీ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు!
పైగా ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నారు. అంటే ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఏపీకి రాజధాని ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఇప్పుడే స్పష్టం అవుతోంది కదా?




