ఏపీ, తెలంగాణ విడిపోయినా అన్నీ సేమ్ టూ సేమ్!

Chandrababu-Naidu-KCR-Jagan-Revanth-Reddy

ఏపీ, తెలంగాణ రెండుగా విడిపోయి దాదాపు పదేళ్ళవుతున్నా రెండు రాష్ట్రాలలో రాజకీయాలు ఇంచుమించు ఒకేరకంగా సాగుతుండటం విశేషం.

ADVERTISEMENT

2019 ఎన్నికల సమయంలో ఏపీలోని టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయశక్తులన్నీ ఏకమైతే, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సరిగ్గా అదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు వైసీపి ప్రభుత్వానికి సరిగ్గా అటువంటి పరిస్థితులు, వాతావరణమే నెలకొంది.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అనేక సమస్యలను సమర్ధంగా ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధిపదంలో నడిపిస్తే, కేసీఆర్‌కి ఆర్ధికంగా, రాజకీయంగా కూడా పెద్దగా ఇబ్బందిలేకపోవడం వలన ఆయన తెలంగాణని అభివృద్ధిచేసుకొన్నారు.

ఏపీని గాడినపెట్టి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రజలు వద్దనుకొన్నట్లే, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌ని వద్దనుకొన్నారు.

ఆనాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏపీని జగన్‌ చేతిలో పెట్టి నాశనం చేసుకోవద్దని చెప్పిన్నట్లే ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ కూడా రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ చేతిలో పెట్టవద్దని పదేపదే చెప్పారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు.

జగన్మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని పాడుబెట్టేయాలని ఆలోచిస్తున్నప్పుడు, “నాపై వ్యక్తిగత, రాజకీయ కక్షతో రాష్ట్రానికి నష్టం చేయవద్దని” చంద్రబాబు నాయుడు పదేపదే వేడుకొన్నారు.

ఇప్పుడు కేటీఆర్‌ కూడా రేవంత్‌ ప్రభుత్వానికి అదేవిదంగా విజ్ఞప్తి చేస్తున్నారు. తమపై రాజకీయకక్ష తీర్చుకోవడం కోసం తెలంగాణ ప్రతిష్టని దెబ్బతీయవద్దని చెపుతున్నారు.

ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి ఇద్దరికీ వడ్డించిన విస్తరివంటి రాష్ట్రాలు లభించాయి. కానీ జగన్‌ ప్రజలు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, ఎన్నికల ముందు తడబడుతున్నారు. రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవే ఒక గొప్ప అవకాశం. దానిని ఆయన సద్వినియోగం చేసుకొంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

అన్నాడు చంద్రబాబు హయంలో చాలా ఆవినీతి జరిగిందంటూ జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తదితరులపై కేసులు నమోదుచేస్తోంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్‌ తదితరుల కోసం కేసులు రెడీ చేస్తున్నారు.

అయితే జగన్‌ ప్రభుత్వంలాగ చేతిలో ఉన్న సీఐడీ చేత హడావుడిగా కేసులు పెట్టించకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ జరిపించబోతున్నారు. అంటే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించి అవినీతి, అక్రమాలను వెలికి తీసి ప్రజల ముందు ఉంచబోతున్నారన్న మాట!

ఇప్పటి వరకు కేసీఆర్‌ వద్ద పనిచేసిన ఉన్నతాధికారుల చేతే తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలు వంటివాటిపై రేవంత్‌ రెడ్డి నివేదికలు తయారు చేయించి, వాటి ఆధారంగా శాసనసభలో శ్వేత పత్రాలు విడుదల చేస్తూ, కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నారు.

కానీ చంద్రబాబు, కేసీఆర్‌ కేసుల విషయంలో తేడా ఏమిటంటే చంద్రబాబు నాయుడుని ఏదోవిదంగా ముందు లోపల వేయాలనే ఆతృతతో ఆయనపై మోపిన కేసులలో దేనికీ సరైన సాక్ష్యాధారాలు చూపించలేక ఏపీ సీఐడీ కోర్టులలో మొట్టికాయలు తింటుంటే, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇంకా విచారణ ప్రారంభించక మునుపే కేటీఆర్‌ ‘స్వేదపత్రం’ పేరుతో తమ అప్పులు, తప్పులను సమర్ధించుకొంటూ ఎదురుదాడి చేస్తున్నారు. మిగిలినవన్నీ సేమ్ టూ సేమ్!

ADVERTISEMENT
Latest Stories