టీడీపీ – జనసేన – బీజేపీ మూడు రాజకీయ పార్టీల మధ్య పొత్తు కుదర్చడానికి అతడే ఒక సైన్యం లా మారి మూడు పార్టీల మధ్య పొత్తు బంధాన్ని సృష్టించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఆ పొత్తు ధర్మానికి తగ్గట్టుగా సీట్ల పంపకం దగ్గర నుంచి తమ పార్టీ నేతలను త్యాగాలకు ఒప్పించడం వరకు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని చక్కదిద్దారు బాబు.
మూడు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది ఇక ఎన్నికల ప్రచారానికి సై అంటూ ప్రజాక్షేత్రంలోకి దూకి కూటమి గెలుపు కోసం ప్రభుత్వం పై అలుపెరుగని పోరాటం చేస్తూ, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజలను చైతన్య పరుస్తూ కూటమి గెలుపుకి ప్రయత్నించాల్సిన బాధ్యత మూడు పార్టీల అధినేతల మీద ఉంటుంది.
ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 21 జనసేనకు, 10 బీజేపీ పార్టీలకు కేటాయించడంతో మిగిలిన 144 స్థానాలలో పోటీ చేయబోతుంది టీడీపీ. అయితే తమ అభ్యర్థులు బరిలో నిలిచే స్థానాలలో ప్రజాగళం పేరుతో ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తూ స్థానిక సమస్యల మీద స్పందిస్తూ స్థానిక నేతలను ప్రజలకు చేరువ చేస్తూ టీడీపీ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.
అయితే పట్టు బట్టి తమకు బలం లేని స్థానాలలో కూడా సీట్లు దక్కించుకున్న బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి మాత్రం మొఖం చాటేస్తున్నారు. ‘నీరు పోసిన వాడు నారు పోయాడా’… అన్న చందంగా ‘సీట్లు ఇచ్చినవాడు గెలిపించలేడా’…అన్నట్లుగా సీట్లు సాధించుకున్న బీజేపీ నేతల ప్రవర్తన కనిపిస్తుంది. తాము గెలవడానికో…మరెవరినో గెలిపించడానికో అన్నట్లుగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలో కూడా స్థానికంగా ఉన్న మిత్ర పక్షాలకు కలుపుకోకుండా ప్రచారాలు మొదలుపెట్టకుండా చేస్తున్న బీజేపీ నేతల కాలయాపన ఎవరి మేలు కోసమో..?
ఇటు జనసేన విషయానికి వస్తే పార్టీ ఆఫీసులలో సభలు, సమావేశాలు అంటూ కొన్నాళ్ళు, సీట్ల పంచాయితీ తేలలేదు అంటూ మరికొన్నాళ్లు, ఇలా ఉన్న విలువైన కాలాన్ని వృధా చేసుకుని ఎట్టకేలకు తానూ పోటీ చేయబోతున్న పిఠాపురం నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఆ మరుసటి రోజే అనారోగ్య కారణాల రీత్యా తిరిగి హైద్రాబాద్ తిరుగు పయనమయ్యారు. అనుకోని ఆరోగ్య సమస్యలతో వెనుతిరగడాన్ని ఎవ్వరు తప్పుపట్టారు.
కానీ పోయిన ప్రతి నిముషం కూటమి గెలుపుకి ఎంత అవసరమో తెలిసి కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మిత్రపక్షాలకు ఏమాత్రం సబబు కాదు. పొత్తు కుదర్చడం మీద పెట్టిన బాధ్యత గెలుపు మీద పెట్టలేక జనసేన, సీట్లు సాధించుకోవడం మీద పట్టిన పట్టు అభ్యర్థుల విజయం మీద చూపక బీజేపీ కూటమి లక్ష్యాన్ని నీరుకారుస్తున్నాయి. ఇప్పటికే సిద్ధం తో ఒక విడత రాష్ట్ర స్థాయి ప్రచారాన్ని పూర్తి చేసున్న వైసీపీ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ కలిసి వచ్చిన సమయాన్ని తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి బస్సు యాత్ర మొదలుపెట్టింది.
తిరిగి అధికారం పొందలేక పోతే జగన్ పరిస్థితి కూడా కేసీఆర్ మాదిరే అన్న ఆలోచనతో జగన్ గెలుపు కోసం తన అస్త్ర శాస్త్రాలను వాడుతుంటే పవన్, బీజేపీ పెద్దలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అటు టీడీపీ క్యాడర్ను ఆందోళనబాట పట్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే గెలుపు అనివార్యం అంటూ కాళ్ళకు చక్రాలు కట్టుకుని
నవ యువకుడి మాదిరి అతడే ఒక సైన్యంలా మారి మండే ఎండలను సైతం లెక్కచేయక ప్రజాగళం పేరిట యాత్రలు కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
అలాగే అటు బాబు కు చేదోడు వాదోడుగా ఉండాల్సిన నారా లోకేష్ తన మంగళగిరికే పరిమితమయ్యి ఈసారి ఎలా అయినా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేయాలనే దృఢ నిశ్చయంతో పని చేస్తున్నారు. బాలకృష్ణ ఇంకా తన హిందూపూర్ లో ప్రచారం కూడా మొదలుపెట్టలేదు. ఇలా ఏవరికి వారు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నా అవేమి పట్టించుకోకుండా తనపని తానూ చేసుకుంటూ కూటమి లక్ష్యానికి తానే ఒక సైన్యం లా ఎన్నికల కథనరంగంలోగి దిగారు బాబు.





