బాబు చాలా బిజీ… మరి మంత్రులో?

Chandrababu Naidu Meeting With Ministers

చంద్రబాబు నాయుడు ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోకుండా చకచకా పనులు చక్కబెడుతూనే ఉన్నారు. అసలు ఈ వయసులో కూడా ఆయనకి ఇంత స్పీడేమిటి? రోజుకి అన్ని గంటలు ఎలా పనిచేయగలుగుతున్నారు?ఇంత చురుకుగా నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నారు?

ADVERTISEMENT

ఆయన ఏమైనా అమృతం తాగారా లేక ఆయనకు మాత్రమే రోజుకి 48 గంటలు ఉంటాయా?అని సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు స్పీడు తగ్గేదేలే అన్నట్లుంది.

యువకుడిని అని చెప్పుకునే జగన్‌ ఏనాడూ ఇంత చురుకుగా పని చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ వయసులో కూడా జగన్‌ కంటే చాలా వేగంగా పనిచేస్తుండటం విశేషం.

చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. అది ముగిసిన వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు.

త్వరలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తదితరులను కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈసారి బడ్జెట్‌లో భారీగా నిధులు, కొత్త విమానాశ్రయాలు, రైల్వే, రోడ్ ప్రాజెక్టులు సాధించుకునేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కేంద్రం నుంచి భారీగా ఆర్ధిక సాయం చాలా అవసరం. అంతకంటే ముందు జగన్‌ పుణ్యామని కొండల్లా పేరుకు పోయిన అప్పులు, వడ్డీల భారం తగ్గించుకోవలసి ఉంది. దీనికి కేంద్రం తోడ్పాటు చాలా అవసరం.

చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తే ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు జరిగి ఎంతో మేలు కలుగుతుంది.

చివరిగా చెప్పుకోవలసిన మాట మరొకటుంది. సిఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతుండటం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కనుక వారు కూడా ఆయన స్పూర్తితో ఆయనతో పోటీ పడి పనిచేయడం అలవాటు చేసుకొని, వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఒక్కరూ తమ పనితనంతో ప్రజల మెప్పుపొందగలగాలి.

ADVERTISEMENT
Latest Stories