ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వం మారడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇదేదో రాజకీయ పక్షపాతంతో చెపుతున్న మాట కాదు. అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు సామాన్య ప్రజల నోట వినిపిస్తున్న మాట!
నిజానికి టిడిపి, జనసేనల పొత్తులకు ముందు వరకు రాష్ట్రంలో వైసీపి గెలుపు ఖాయమే అన్నట్లు ఉండేది. రెండు పార్టీల పొత్తులలో అరమరికలు ఏర్పడినప్పుడు కూడా రేసులో వైసీపి ముందు ఉండేది.
కానీ వాటి పొత్తులు బలపడిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజాభిప్రాయం క్రమంగా మారసాగింది. మళ్ళీ సీట్ల సర్దుబాట్లప్పుడు ప్రజలలో వాటి ఐక్యత పట్ల కాస్త అపనమ్మకం కనపడింది. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వంటివారిని ఉపయోగించుకొని వాటిని దెబ్బ తీయాలని వైసీపి చాలా ప్రయత్నించింది.
కానీ అనూహ్యంగా రెండు పార్టీల మద్య బంధం మరింత బలపడటంతో దాని కుట్రలు, కుతంత్రాలు అన్నీ విఫలమయ్యాయి. టిడిపి, జనసేనల ఐఖ్యత, పరస్పర అవగాహన, వాటి మద్య బలమైన బంధం ఏర్పడటం వంటివి కూటమికి చాలా సానుకూలంగా మారాయి.
వాటితో బీజేపీ చేరిక వలన పెద్దగా ప్రభావం చూపకపోయినా, అమరావతి, పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సాయం చేస్తుందనే మోడీ హామీ కూటమికి ఉపయోగపడుతోంది.
రాష్ట్రంలో రాజకీయ బలాబలాలో ఈ మార్పులు, ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ వంటి అంశాలను టిడిపి, జనసేనలు తెలివిగా ఉపయోగించుకొని తమ వాదనలతో ప్రజలు కనెక్ట్ అయ్యేలా చేయగలిగాయి.
ఇదే సమయంలో వైసీపికి మూలస్తంభంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ‘ఎన్నికలు సక్రమంగా జరుగుతాయానే ఆశ రోజురోజుకీ సన్నగిల్లిపోతోందంటూ’ అస్త్ర సన్యాసం చేసిన్నట్లుగా మాట్లాడటం, వివిద మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో జగన్మోహన్ రెడ్డి తడబడుతుండటం, పోలింగ్ ముగియగానే విదేశాలకు బయలుదేరాలనుకోవడం వంటివి వైసీపి ఓడిపోబోతోందనే భావన ప్రజలలో వ్యాపించేలా చేశాయని చెప్పవచ్చు.
ఏపీ రాజకీయాలలో వైఎస్ షర్మిల ప్రవేశం తర్వాత తన జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చేస్తున్న ఆరోపణలతో వైసీపి ప్రతిష్ట మసకబారడం మొదలైంది. వివేకా హత్య కేసు చెల్లెళ్ళ రూపంలో ఇంకా వెంటాడుతూనే ఉంది. చెల్లెళ్లతో వైసీపికి జరిగే నష్టం ఎంతనేది ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.
ఇవికాక ఈ 5 ఏళ్ళలో జగన్ చేసుకున్న స్వయంకృతాపరాధాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ 10-15 రోజులలోనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక వాతావరణం ఏర్పడిన్నట్లు కనిపిస్తోంది.
ఓ సినిమా లేదా రాజకీయ పార్టీ జయాపజయాలపై ‘మౌత్ టాక్’ చాలా ప్రభావం చూపుతుందని అందరికీ తెలుసు. గత ఎన్నికలలో ‘ఈసారి జగనే’ అనే ‘మౌత్ టాక్’సర్వత్రా వినిపించినప్పుడు వైసీపి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ‘ఈసారి కూటమే’ అనే ‘మౌత్ టాక్’ వినిపిస్తోంది. అంటే మార్పు అనివార్యమే అని భావించవచ్చు.




