ప్రభుత్వ పాఠశాలలకు మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటన కొత్త విషయం ఏమీ కాదు కానీ ఒకేసారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కలిసి వెళ్ళి ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లి తండ్రులతో మాట్లాడటం, విద్యార్ధులతో కలిసి భోజనాలు చేయడం చాలా విశేషమే.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లి తండ్రులతో మంత్రులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలకు వెళ్ళగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హైస్కూలుకి వెళ్ళి ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లి తండ్రులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి, తమ అభిమాన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చి తరగతి గదిలో కూర్చొని తమతో మాట్లాడుతుంటే ఆ విద్యార్ధులు ఎంత సంతోషిస్తారో చెప్పక్కర లేదు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వేర్వేరుగా ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తరగతి గదిలోకి వెళ్ళి పిల్లలతో మాట్లాడారు. తర్వాత వారిరువురూ పిల్లలతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు.
జగన్ ఇంగ్లీష్ చదువులు, ఆన్ లైన్ పాఠాల కోసం అంటూ వందల కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు నాసిరకం ట్యాబ్స్ కొని అందజేశారు. అవి ఏవిదంగా దుర్వినియోగం అయ్యాయో అందరికీ తెలుసు.
కానీ టెక్నాలజీని ఎంతగానో ప్రోత్సహించే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్లకు దూరంగా ఉండాలని చెప్పడం విశేషం. వాటితో జరుగుతున్న అనర్ధాలను చక్కగా వివరించి, అవసరమైనంత మేరకే వాటిని వినియోగించుకోవాలి తప్ప మొబైల్ వ్యసనంతో వాటికి బానిసలుగా మారి జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ తాము మాట్లాడటం కంటే ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లితండ్రులు చెప్పేది వినేందుకే ఎక్కువ సమయం కేటాయించడంతో పాఠశాల స్థాయిలో ఎదురవుతున్న అనేక సమస్యలు, అవసరాలు, చక్కటి సలహాలు, సూచనలు వారికి అందాయి.
ఇక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ ఎలాగూ చాలా పాపులర్. కనుక ఆయన కోసం ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లితండ్రులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఆయన కూడా ఎటువంటి భేషజాలు లేకుండా వారితో కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకున్నారు. విద్యార్ధులు పవన్ కళ్యాణ్తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడితే ఎవరినీ కాదనకుండా ప్రతీ ఒక్కరినీ పలకరించి మరీ అడిగిన వారందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
పాఠశాల విద్యార్ధుల సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకుని వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఏపీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ముగ్గురూ వారితో మమేకం అయిన తీరు చూసి అందరూ చాలా సంతోషించారు. వారి పర్యటనలు ఆయా పాఠశాలలలో ప్రతీ ఒక్కరికీ మధురనుభూతిని కలిగించాయే తప్ప ఎవరూ ఆందోళన చెందలేదు.




