పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావు పేటకు చేరుకున్నాయి. తమ ఊరుకి తరలివచ్చిన గోదావరి జాలాలు చూసేందుకు నిన్న సాయంత్రం నుంచే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గోదావరి నీటిని చూసి రైతులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం సిఎం చంద్రబాబు నాయుడు పాయకరావుపేట చేరుకొని జల హారతి ఇస్తారు. అనంతరం పీఎల్ పురం వద్ద జరిగే సభలో పాల్గొంటారు.
ఇప్పటికే మంత్రులు నిమ్మల రామానాయుడు, అనితా వంగలపూడి, కొల్లు రవీంద్ర, పార్ధ సారధి, ఎమ్మెల్యే రత్నప్రభ అక్కడకు చేరుకున్నారు.
గోదావరి జలాలు తమ ప్రాంతానికి తీసుకు వచ్చినందుకు గ్రామస్తులు వారితో తమ సంతోషం పంచుకుంటున్నారు. మంత్రులు, అధికారులు మధ్యాహ్నం జరిగే సభకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
పోలవరం నుంచి అనకాపల్లి జిల్లాకు గోదావరి అంత సులువుగా రాలేదు. గోదావరి నీటిని రప్పించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది.
పోలవరం అనకాపల్లి మద్యలో పదకొండు జాతీయ రహదారులు అడ్డంగా ఉన్నాయి. వాటిని తప్పించుకుంటూ ముందుకు సాగేందుకు ఆరు వేర్వేరు కాలువలు, పైప్ లైన్లు నిర్మించాల్సి వచ్చింది. ఆ తర్వాత తుని మండలంలోని కుమ్మరిలోవ వద్ద ఏకంగా పెద్ద కొండ అడ్డంగా ఉంది. కనుక దానిని వంద మీటర్లు లోతున జేసీబీలతో తొలగించి వందలాది లారీలలో ఆ కొండ రాళ్ళను, మట్టిని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది.
మళ్ళీ అక్కడ కాలువలు, పైప్ లైన్లు ఏర్పాటు చేశాక వాటి ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. భగీరథ ప్రయత్నమంటే ఇదే కదా?
దీంతో విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, విశాఖ జిల్లాలోని 143 గ్రామాలకు తాగునీరు అందుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న ఆర్సల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, కొత్తగా ఏర్పాటవుతున్న వివిధ పరిశ్రమలకు కూడా నీరు అందుతుంది. జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మరో 1.39 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి కోసం రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు తీరని అన్యాయం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది.
కానీ వెలిగొండతో అటు నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలకు, పోలవరం ఎడమ కాలువతో ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగుసాగు నీటిని అందిస్తున్నారు. దీని కోసం వేలకోట్లు ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు.
జగన్ సంక్షేమ పధకాలే ముఖ్యమని అభివృద్ధిని విస్మరించారు. కానీ చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలు అమలుచేస్తూనే మరో పక్క అమరావతి, పోలవరం నిర్మిస్తున్నారు. అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నారు.
నెల్లూరుకి కృష్ణమ్మ, అనకాపల్లికి చేరిన గోదావరి జలాలే ఇందుకు తాజా సాక్ష్యం. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభివృద్ధికి మరో సాక్ష్యం!.. కాదా?






