చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు ఇంకెన్నాళ్ళు?

Chandrababu-Naidu-Bail-Petition

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ ఏపీ సీఐడీ అధికారులు సెప్టెంబర్‌ 9వ తేదీన అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. అప్పటి నుంచి ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ పొడిగిస్తూనే ఉంది. నేటితో గడువు ముగుస్తుండటంతో మళ్ళీ నవంబర్‌ 1వ తేదీ వరకు పొడిగించింది.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు కేవలం టిడిపి అధినేత మాత్రమే అయితే ఆయన రిమాండ్‌ పొడిగింపుపై ఎవరూ వేలెత్తి చూపేవారే కారు. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాయకుడుగా ముందుండి నడిపించారు. ఆయన వయసు 73 ఏళ్ళు.

ఓ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసే ముందు గవర్నర్‌కు తెలియజేసి ఆయన అనుమతి తీసుకోవలసి ఉండగా వైసీపి ప్రభుత్వం అదీ పట్టించుకోలేదు. అసలు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విషయం తనకు తెలియనే తెలియదని జగన్మోహన్‌ రెడ్డి నమ్మబలికారు.

చంద్రబాబు నాయుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే, ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారులే ఈ కేసులో సాక్షులవుతారు కనుక!

అయినప్పటికీ ఏసీఏబీ కోర్టు ఆయన రిమాండ్‌ పొడిగిస్తూనే ఉంది. ఎందుకు పొడిగిస్తోందో? ఇంకా ఎంతకాలం పొడిగించబోతోందో?కూడా ఎవరికీ తెలీదు.

చంద్రబాబు నాయుడు ఆర్ధిక నేరానికి పాల్పడ్డారని ఇంతవరకు ఏ కోర్టులో నిరూపించబడలేదు. ఒకవేళ నిరూపించేవరకు రిమాండ్‌ పొడిగించడం అవసరమని భావిస్తున్నట్లయితే, అదే రూల్ అక్రమాస్తుల కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులకు కూడా వర్తింపజేయాలిగా?

వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ తటపటాయిస్తోంది. కానీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని ఆఘమేఘాల మీద అరెస్ట్ చేయడమే కాకుండా కనీసం బెయిల్‌ కూడా మంజూరు చేయడం లేదు.

చంద్రబాబు నాయుడు ఆర్ధిక నేరానికి పాల్పడ్డారో లేదో రుజువు కానప్పుడు, ఇదేదో చాలా అసాధారణమైన కేసన్నట్లు, ఆయనేదో కరడుగట్టిన నేరస్థుడన్నట్లు రిమాండ్‌ పొడిగించడాన్ని ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడుకి రిమాండ్‌ పొడిగిస్తూ, బెయిల్‌ తిరస్కరిస్తుండటం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అవుతోంది కదా?

ADVERTISEMENT
Latest Stories