రహస్య మంతనాలు… ఏపీలో 17వేల కోట్ల పెట్టుబడులు..!

Chandrababu Naidu secrete meeting for kadapa steel plantనవ్యాంధ్ర సిగలో మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చి చేరబోతోంది. 17 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపించేందుకు అంతర్జాతీయ సంస్థ ఒకటి ముందుకొచ్చింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు కడపలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మెకన్సీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపించింది.

అయితే ప్రస్తుతానికి తమ సంస్థ పేరును ఎక్కడా బయటపెట్టకూడదన్న ఆ సంస్థ షరతుతో ప్రభుత్వం ఆ సంస్థ పేరును గోప్యంగా ఉంచింది. తాజాగా చంద్రబాబుతో భేటీ అయిన ఆ సంస్థ ప్రతినిధులు వనరుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. కడప సహా మరిన్ని ప్రాంతాల్లోనూ ప్లాంటు ఏర్పాటుపై ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT

కడపలో కనుక ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే రాయలసీమ ప్రాంతానికి చెందిన వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అలాగే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఇచ్చిన హ్యాండ్ ను ఏపీ సర్కార్ తిప్పికొట్టినట్లవుతుంది. మరోవైపు చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వెయ్యి కోట్ల రూపాయలతో హింద్‌వేర్ తయారీ ప్లాంట్లను స్థాపించనున్నట్టు ఆ సంస్థ ఎండీ సందీప్ సోమానీ తెలిపారు. ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌తో కలసి బుధవారం ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు మరో రెండు చోట్ల కూడా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. అలాగే ఎల్జీకెమ్ పాలిమర్స్ సంస్థ కూడా ఏపీలో విస్తరణకు సిద్ధమైంది. బుధవారం చంద్రబాబుతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోమారు భేటీ అవుతామని పేర్కొన్నారు. మిత్సుబిషీ, జిప్ తయారీ రంగంలో పేరెన్నికగన్న వైకేకే ప్రతినిధులు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ADVERTISEMENT
Latest Stories