గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాను వైసీపి క్లీన్ స్వీప్ చేసి కంచుకోటలా మార్చుకుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్నిలొచ్చే సమయానికి నెల్లూరులో పోటీ చేసేందుకు వైసీపికి బలమైన అభ్యర్ధులు లేకుండా పోయారు.
కనుక విజయసాయి రెడ్డి వంటివారిని బరిలో దించాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లా వైసీపి చేజారిపోయిందని తెలిసి ఉన్నప్పటికీ, ఇంకా అక్కడ వైసీపికి తిరుగులేదని ఇంకా వాదిస్తూనే ఉన్నారు.
కానీ నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి నెల్లూరు నగరంలో రోడ్ షో నిర్వహించినప్పుడు వేలాదిగా ప్రజలు తరలిరావడం గమనిస్తే వారు మార్పు కోరుకుంటున్నారని, కనుక ఈసారి ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని స్పష్టమవుతోంది.
అసలు విషయానికి వస్తే, ఈ రోడ్ షోలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. “చంద్రబాబు నాయుడు 1990 దశకం చివరిలో ‘విజన్-2020’ అంటుంటే అది ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను.
ఆయన హైదరాబాద్ని ఐటి కేంద్రంగా అభివృద్ధి చేసి ఐటి కంపెనీలను తీసుకురావడంతో ఈ మూడు దశాబ్ధాలలో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో కళ్ళారా చూస్తున్నాను.
జగన్ ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించగలడు. అటువంటి రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు. కొన్ని తరాల భవిష్యత్ గురించి ఆలోచించేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. చంద్రబాబు నాయుడు అటువంటి దూరదృష్టి కలిగిన గొప్ప రాజకీయ నాయకుడు.
ఐదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. అప్పుల పాలైపోయింది. కనీసం యువతకు ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారు. కనుక మన రాష్ట్రాన్ని మళ్ళీ బాగుచేసుకొని అభివృద్ధి చేసుకోవాలంటే ఆ సత్తా ఉన్న చంద్రబాబు నాయుడుని, మన టిడిపి, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నటికీ పోటీపడలేరని అందరికీ తెలుసు. జగన్కు చాలా దూరదృష్టి ఉంది కానీ అది వైసీపి కోసమే ఉపయోగించుకుంటారు తప్ప రాష్ట్ర హితానికి కాదు. ఆనాడు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చాలా తెలివైనవారే. కానీ ఆయన తన తెలివితేటలను అవినీతికి వినియోగించుకొని జైలు పాలయ్యారు.
జగన్ కూడా లాలూ ప్రసాద్లాగే తన తెలివితేటలను సరైన విదంగా ఉపయోగించుకోలేదు. తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో చేసిన నిర్వాకాలకు 16 నెలలు జైల్లో ఉన్నారు. జగన్ కూడా లాలూ ప్రసాద్లాగే తన తెలివితేటలను వైసీపి రాజకీయాల కోసం ఉపయోగించారు.
వైసీపి రాజకీయాల కోసం ఆంధ్రుల కలల రాజధాని అమరావతిను పాడుబెట్టేసి మూడు రాజధానులంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసి ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చేశారు.
జగన్ కూడా లాలూ ప్రసాద్లాగే తన దూరదృష్టిని వైసీపి ఓటు బ్యాంకుని నిర్మించుకునేందుకు ఉపయోగించుకున్నారు. సంక్షేమ పధకాలు… వాటిని అమలుచేసేందుకు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు సృష్టించుకున్నారు. వాటి కోసం చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
పవన్ కళ్యాణ్ చెప్పిన్నట్లు రెండు మూడు తరాల భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన జగన్మోహన్ రెడ్డి, రెండు మూడు తరాల భవిష్యత్ని దెబ్బ తీసే నిర్ణయాలు, విధానాలు అమలుచేశారు. దేనికంటే ఈ ఎన్నికల కోసమే!
తెలంగాణకు ఐటి రంగం అనే కామధేనువుని అందించి, తెలంగాణతో పాటు నేడు ఆంధ్రా యువతకు కూడా అక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినవారు చంద్రబాబు నాయుడు. ఆయనకు అంత దూరదృష్టి, ఆలోచ్నా ఉంది కనుకనే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం అందరూ చూశారు. ఐదేళ్ళ జగన్ పాలనలో దయనీయస్థితిలో సకల రాజకీయ అవలక్షణాలతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడు గాడిన పెట్టుకొని క్లీన్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు చేతికి పగ్గాలు అప్పగించడం అవసరం ఎంతైనా ఉంది. “ఈసారి చంద్రబాబు నాయుడే” అనే ‘మౌత్ టాక్’ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది కూడా.




