ప్రత్యేక హోదా కోసం ఏపీ సర్కారు పట్టుబడుతుంటే… అందుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన కేంద్రం… ఏపీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా సింగిల్ విడతలో 1,976 కోట్లను విడుదల చేసిన కేంద్రం… ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు 1,176 కోట్లను కేటాయించింది. ఇక నవ్యాంద్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గాను 450 కోట్లను, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 350 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే కేంద్రం ప్రకటించిన ఈ ఆర్థిక సాయంలో స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఉదారంగా ఆలోచించాలని, ఏపీకి కేంద్రం ప్రకటించిన నిధులు నామమాత్రమేనని, బుందేల్ ఖండ్ కు మంచి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం ఏపీ విషయంలో అంత ఉదారంగా ఎందుకు ఆలోచించడం లేదో తెలియట్లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాల నీటి అవసరాలు తీరుస్తామని, అందుకు కేంద్రం సహకరించాలని కోరారు. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు రావాలని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అన్నారు.



