చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ ముఖ్యమంత్రిగా గొప్ప అవకాశం లభించింది. చంద్రబాబు నాయుడుకి రెండు సార్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని తన సమర్ధత నిరూపించుకుంటుటుంటే, జగన్కు దక్కిన ఓకే ఒక్క అవకాశాన్ని చేజేతులా పాడుచేసుకున్నారు.
జగన్ కూడా అమరావతి నిర్మాణ పనులు కొనసాగించి పూర్తిచేసి ఉంటే బహుశః మళ్ళీ జగన్కు అధికారం లభించి ఉండేది. కానీ వద్దనుకోవడమే కాకుండా భూములిచ్చిన రైతులను వేధించి కంట తడిపెట్టించారు. వారి ఉసురు తగిలి వైసీపీ ఓడిపోయింది.
జగన్ వద్దనుకున్న అమరావతిని చంద్రబాబు నాయుడు మళ్ళీ భుజానికెత్తుకొని పనులు ప్రారంభిస్తున్నారు. ఈసారి మూడేళ్ళలో పూర్తి చేయాలని గడువు విధించుకున్నారు కనుక వచ్చే ఎన్నికల నాటికి అమరావతి కూటమిని మళ్ళీ గెలిపిస్తుంది.
అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజధాని నిర్మించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరు శాశ్వితంగా నిలిచిపోతుంది కూడా. ఓ రాజకీయ నాయకుడుకి జీవితంలో ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? జగన్ ఈ గొప్ప అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు కదా?
కానీ చరిత్రలో తన పేరు కూడా శాశ్వితంగా నిలిచిపోతుందని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటారు. దేశంలోనే తొలిసారిగా ఐదేళ్ళ పాటు మరో ఆలోచన లేకుండా సంక్షేమ పధకాలతో ప్రజలకు మేలు చేశానని కనుక ప్రజలు ఎప్పటికీ తనని గుర్తుంచుకుంటారని జగన్ చెప్పుకుంటారు.
కానీ రాజధాని కడితే ప్రజలు గుర్తుంచుకుంటారా ఓ లక్ష రూపాయలు చేతిలో పెడితే గుర్తుంచుకుంటారా? అని ఆలోచిస్తే జగన్ వాదనలో డొల్లతనం అర్దమవుతుంది. సంక్షేమ పధకాలతో లబ్ధి పొందినవారే నాకు ఓట్లు వేయలేదని జగన్ స్వయంగా చెప్పుకున్నారు కదా?
కానీ చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్లో ఐటి కంపెనీలను తెచ్చి వాటి కోసం సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కాలేజీలను, పలు ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు ప్రోత్సహించారు. అవన్నీ నేటికీ ఆయన దార్శనికతకు నిలువెత్తు అద్దాలుగా నిలబడే ఉన్నాయి. వాటి ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకున్నవారందరూ నేటికీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటారు.
జగన్ 5 ఏళ్ళ విధ్వంస పాలనకి నిదర్శనంగా సంక్షేమ పధకాల కోసం చేసిన అప్పులు, నేటికీ అక్కడక్కడా జగన్ బొమ్మలు, స్టిక్కర్లు, వైసీపీ రంగులు మాత్రమే కనబడతాయి.
కనుక జగన్ తప్పుడు విదానాలు, ఆలోచనలు, రాజకీయ ద్వేషంతో భస్మాసురుడిలా తనని తాను, తన పార్టీని కూడా భస్మం చేసుకుంటే, మరో వంద సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు తనని గుర్తుచేసుకునేలా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. ఒకరిది నిర్మాణాత్మకమైన ఆలోచన మరొకరిది విధ్వంసకరమైన ఆలోచన. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలకి మద్య ఈ తేడా ఇదే!
కనుక జగన్ ఓ గొప్ప అవకాశాన్ని జారవిడుచుకొని బాధపడుతూ మరో అవకాశం కోసం ఎదురు చూస్తుంటే, దక్కిన గొప్ప అవకాశాన్ని చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకొని మళ్ళీ మరో అవకాశం లభిస్తుందని నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.




