ఎపిలో టీడీపీ, బిజెపి నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. గుజరాత్ ఎన్నికల గెలుపు ఊపులో 2014 లో బిజెపి దయా దాక్షిణ్యాలతోనే చంద్రబాబు అదికారంలోకి వచ్చారని, 2019లో రాష్ట్రంలో మేమే హీరోలం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. దానికి ప్రతిగా సోము వీర్రాజు ప్రగల్భాలకు పోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఆయన పగటి కలలు కంటున్నారని, ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలని ఆయన సూచించారు. అయితే… దీనిపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.
కాగా… భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాజేంద్రప్రసాద్కు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కొంత గందరగోళంగా తయారయ్యింది. చంద్రబాబు నిజంగానే భయపడుతున్నారా? లేక చెప్పాల్సిందంతా చెప్పక తూతుమంత్రంగా ఆగ్రహం వ్యక్తం చేసారు అనే లీకులు ఇస్తున్నారా అనేది తెలియదు.
సోము వీర్రాజు, రాజేంద్రప్రసాద్ మాటలకేమిగానీ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ దమ్ము ఎంతో ప్రజలకు తెలియనిదా? పార్టీలో కీలక నేతలమని చెప్పుకునే నేతలకువారి సొంత బలమేంటో తెలియకపోతే ఆ పార్టీకి వారు ఏ విధంగా ఉపయోగపడతారో వారికే తెలియాలి? ప్రస్తుతానికి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు.



