ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి అంకంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈరోజుతో నామినేషన్ల విరమణ గడువు ముగుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలూ ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. ప్రధాన పార్టీ అధ్యక్షులు – చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లు కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఎన్నికల ముంగిట ప్రజల పై సంక్షేమ పథకాలతో ముంచెత్తడానికి సిద్ధం అవుతున్నారు చంద్రబాబు నాయుడు. ప్రచారం ముగిసేవరకూ అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో డబ్బు ముట్టచెప్పబోతున్నారు.
ఏప్రిల్ 1న దాదాపుగా 57 లక్షల మందికి లబ్ది చేకూర్చే పెన్షన్లతో పాటు నిరుద్యోగభృతి కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే ఏప్రిల్ 4న డ్వాక్రా మహిళలకు చివరి విడత పసుపుకుంకుమ కింద ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయిలు ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 4న రుణమాఫీకి అర్హులైన రైతులకు నాలుగు, ఐదో విడత డబ్బులు ఖాతాలో వెయ్యబోతున్నారు. రైతులకు గరిష్టంగా 60 వేలు + వడ్డీ దక్కబోతోంది. ఏప్రిల్ 8న రైతుల ఖాతాలలో అన్నదాతా సుఖీభవ కింద నాలుగు వేల రూపాయిలు పడబోతున్నాయి.
ప్రచారం రేపు ముగుస్తుంది అనగా అన్ని పథకాల సొమ్ములు ఖాతాలలో జమ అయిపోతాయి. ఏప్రిల్ 9తో ప్రచారం ముగిసిపోతుంది. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వెయ్యడానికి వెళ్ళబోతున్నారు. ఈ పథకాల ప్రభావం జనం మీద ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఒక వేళ తీసుకున్న డబ్బుకు ఋణం తీర్చుకోవాలని ప్రజలు అనుకుంటే అనూహ్యమైన మెజారిటీతో చంద్రబాబు మరొక సారి గద్దె నెక్కడం ఖాయం. ఈ క్రమంలో ప్రతిపక్షం కొంత మేర ఆందోళనలో ఉన్న మాట వాస్తవమే.



