రాజకీయాలలో ఎవరి గోతులు వాళ్ళే తీసుకోవడం చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంటుంది. గతంలో తొమ్మిదేళ్ళ పాటు అధికారంలో ఉంటూ… మరో ఏడాది పాలన ఉండగా, అసెంబ్లీ రద్దు చేసుకుని ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు నాయుడు ఆయన గొయ్యి ఆయనే తీసుకున్న వైనం రాజకీయ నాయకులకు ఒక పాఠంలా ఉపయోగపడుతోంది. అయితే అలాంటి సందర్భాలు రిపీట్ కాకుండా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధికారంలో ఉన్న చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం తన గొయ్యిని తానే తీసుకుంటూ సరికొత్త రాజకీయ నాయకుడిగా అవతరిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాలలో పొరపాట్లు చేయడం ఏ రాజకీయ నాయకుడికైనా సహజం. అపరచాణక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబు కూడా ఇందుకు మినహాయింపు కాదని నాటి సంఘటన రుజువు చేసింది. కానీ జగన్ విషయంలో మాత్రం ఒకటి, రెండు సందర్భాలలో కాదు, వైసీపీ ఎప్పుడైతే పుంజుకోవాల్సిన సమయం వస్తుందో అప్పుడే తన వ్యాఖ్యలతో పార్టీని నీరుగార్చేస్తుంటారు.
ఇటీవల నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చే విధంగా వైసీపీ అవతరిస్తుందని పొలిటికల్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూసిన నేపధ్యంలో… వార్ ను వన్ సైడ్ చేసే విధంగా జగన్ చేసిన అసందర్భపు ప్రేలాపనలు వైసీపీకి మైనస్ గా మారాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించే జేసీ దివాకర్ రెడ్డి కూడా తాజాగా ‘నంద్యాలలో జగన్ ప్రసంగం తర్వాత టిడిపి మెజార్టీ ఇంకా పెరుగుతుందనే’ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఇక తనను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ ఓ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని, అధికారంలో లేనప్పుడే జగన్ శాడిస్టులా ఉంటే… అధికారంలోకి వస్తే ఉన్మాదిలా మారిపోతాడని…” జగన్ భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదని, వైసీపీ క్రమంగా తన ఉనికిని కోల్పోతోందని, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 30 సీట్లకు మించి రావని సర్వేలు తేల్చి చెప్తున్నట్లుగా జగన్ మనోబలంపై కొట్టారు చంద్రబాబు.


