ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇంచుమించు ఒకే సమయంలో రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలలో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. గమ్మతైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి సభకి జనాలను బ్రతిమాలుకొనో బెదిరించో తీసుకురావలసి వస్తుంటే, చంద్రబాబు నాయుడు పర్యటనలకి వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గంలోని జోగినాధునిపాలెంలో శుక్రవారం సిఎం జగన్ బహిరంగసభ నిర్వహించారు. ఎప్పటిలాగే జిల్లాకి చెందిన వైసీపీ నేతలు జనసమీకరణ చేసి సభని విజయవంతం చేశారు. చివరికి ఉపాధి హామీ కూలీలను కూడా తీసుకువచ్చి అందరికీ హాజరు వేశారు.
నియోజకవర్గంలో సిఎం జగన్ సభకి మహిళలని తరలించడానికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయడం, స్కూళ్ళకి సెలవులు ప్రకటించడం వంటివన్నీ సర్వసాధారణమైపోయాయి. ఇక సిఎం జగన్ జిల్లా పర్యటన అంటే ఆరోజు ఆర్టీసీ బస్సులన్నీ జనసమీకరణకి వెళ్ళిపోతుంటాయి. నిన్న నర్సీపట్నంలో కూడా అలాగే జరిగింది. సుమారు 700 బస్ సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనుక ఆయా జిల్లాలకు ప్రయాణాలు పెట్టుకొనే ముందు జగన్ పర్యటన గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం లేకుంటే ఇబ్బందులు తప్పవు.
తన సభకి జనాలను తరలించి తీసుకురావలసివస్తోందని తెలిసి ఉన్నప్పటికీ సిఎం జగన్, చంద్రబాబు నాయుడి సభల గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడటం విశేషం. నిన్న నర్సీపట్నం సభలో సిఎం జగన్ ప్రసంగిస్తూ, “మొన్న కందుకూరు పట్టణంలో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు చాలా భారీగా జనాలు తరలివచ్చారని చూపుకొనేందుకు, ఆయన ఇరుకుగా ఉండే వీధిలోకి జనాలను నెట్టడంతో ఆ త్రోక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లేని జనం ఉన్నట్లు చూపేందుకు ఇరుకు వీదుల్లో రోడ్ షోలు చేస్తూ డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించుకొంటారు,” అని ఆరోపించారు.
మొన్న కందుకూరు త్రొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు కనుక చంద్రబాబు నాయుడు నిర్వహించే రోడ్ షోలకి, సభలకు హాజరయ్యేందుకు ప్రజలు వస్తారో లేదో అనే అనుమానం కలగడం సహజమే. కానీ నిన్న నెల్లూరు జిల్లా, కోవూరు పట్టణం ప్రధాన కూడలిలో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించిన్నప్పుడు వేలాదిగా జనాలు తరలివచ్చారు. వారిలో చాలా మంది స్వచ్ఛందంగా తరలివచ్చినవారే. టిడిపి నేతలు జనసమీకరణ చేసి బస్సులు లారీలలో తరలించి తీసుకురాలేదు. కనీసం ఎవరికీ పులిహోర, బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదు. అయినా భారీగా జనాలు తరలివచ్చారు. ఫోటోలు చూస్తే ఈ విషయం అర్దమవుతుంది.
కానీ చంద్రబాబు నాయుడు సభలకి జనాలు రావడం లేదని, లేని జనాన్ని ఉన్నట్లు చూపుకొంటున్నారని సిఎం జగన్ ఆరోపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక ఇక నుంచి వైసీపీ నేతలు కూడా ప్రజలను ఒత్తిడి చేయకుండా, జనసమీకరణ చేయకుండా ఊరుకొని సిఎం జగన్ సభకి ఎంతమంది స్వచ్ఛందంగా వస్తారో తెలుసుకొనే ప్రయత్నం చేయవచ్చు కదా?



