ఒకప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు అంటే పెద్దగా హంగామా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణ వేడెక్కడంతో కార్పొరేషన్ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష అధినేత తీరును ప్రజల ముందు ఏకరువు పెడుతూ ప్రసంగించారు. ‘ప్రతిపక్ష నాయకుడంటే జగన్ మోహన్ రెడ్డిలా ఉండకూడదని’ అన్న చంద్రబాబు, దానిని లాజిక్ తో ముడిపెడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను తన దృష్టికి తీసుకువస్తే, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని, వాటికి పరిష్కార మార్గాలు తీసుకున్నామని, అయితే జగన్ మాత్రం ఇలా వ్యవహరించడని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, తద్వారా గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తాడని, నడిరోడ్డుపై కాల్చేయాలని, ఉరేయాలని అంటున్నాడని… పవన్ తో పోలుస్తూ జగన్ ప్రవర్తనను చాలా లాజిక్ గా ప్రజల ముందుంచారు.
అలాగే తూర్పు గోదావరి జిల్లా అంటే శాంతికి, ప్రశాంతతకు మారుపేరని, జగన్ లాంటి వారిని గెలిపిస్తే అందుకు భంగం కలుగుతుందని స్థానిక వ్యవహారం జగన్ తీరుకు వ్యతిరేకంగా ఉంటుందన్న భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడుతుంటే, వాటిని అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిలా మారారని అన్నారు. రౌడీయిజం, గూండాయిజానికి ఎక్కడా చోటు ఉండకూడదని, వైసీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని వారిని చిత్తుగా ఓడించాలని, డిపాజిట్లు కూడా రాకుండా చూడాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.


