చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో ఇటీవల జరిగిన వుక్సీ ఇంటర్నేషనల్ మారథాన్ పోటీల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోటీల్లో చివరి సెకన్ల వరకు మొదటి, రెండవ స్థానాల్లో ఉన్న పరుగుల వీరులు చిన్న పొరపాటు పడడంతో మూడోస్థానంలో ఉన్న రన్నర్ విజేతగా నిలిచాడు. 42 కిలోమీటర్ల మారథాన్ లో తొలి రెండు స్థానాల్లో ఇథియోపియాకి చెందిన రన్నర్లు ఉన్నారు. వారి వెనుక మూడవ స్థానంలో ఉన్న బహ్రెయిన్కి చెందిన రన్నర్ ఉన్నాడు.
మరికొన్ని సెకన్లలో లక్ష్యం చేరుకుంటారన్న సమయంలో, చివరి వంద మీటర్ల దూరంలో ఫినిష్ లైన్ మాత్రమే ఉండడంతో అంతా ఇక ఇథియోపియా రన్నర్లే విజేతలుగా నిలుస్తారని అందరూ భావించారు. అయితే చివరి నిముషంలో లక్ష్యం దిశగా కాకుండా, ట్రాక్ తప్పి పరిగెత్తారు. లక్ష్యం అందుకోవడానికి ఎడమవైపుకు తిరగాల్సి ఉండగా, దానిని గమనించకుండా ఇథియోపియా రన్నర్లు నేరుగా పరుగెత్తారు.
అయితే లక్ష్యం ఎడమవైపున ఉందని గుర్తించిన మూడోస్థానంలో ఉన్న రన్నర్ మాత్రం ఎడమవైపు తిరిగి పరుగెత్తాడు. ఇథియోపియా రన్నర్లకి నిర్వాహకులు సూచన ఇవ్వడంతో తిరిగి వెనక్కి వచ్చి పరుగెత్తినా లాభం లేకుండా పోయింది. అప్పటికే బహ్రెయిన్ రన్నర్ ఫినిష్ లైన్ని చేరుకోవడంతో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఆసక్తికర ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



