చిరంజీవిని మళ్ళీ రాజకీయాలలోకి లాగడం అవసరమా?

Chinta Mohan

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో ఇంతకాలం కలుగులలో దాక్కున్న కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వారిలో మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఒకరు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజల ఆలోచనలో హటాత్తుగా మార్పు వచ్చింది.

ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కనుక చిరంజీవి మళ్ళీ రాజకీయాలలోకి తిరుపతి నుంచి శాసనసభకు పోటీ చేస్తే ఆయనను 50 వేల మెజార్టీతో గెలిపించుకుంటాము. ఆయన వస్తే గెలవడమే కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో కాపులందరూ తమ వాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నారు. కాపునేత ఈసారి ముఖ్యమంత్రి కాలేకపోతే మరెన్నటికీ కాలేరు.

ADVERTISEMENT

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల తీరుతో ప్రజలు వేసరిపోయి ఉన్నారు. కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో 130 శాసనసభ, 20 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది. ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం పార్టీలు భాగస్వాములుగా ఉన్నందున సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈసారి నగరి నుంచి శాసనసభకు పోటీ చేయాలని కోరుతున్నాను. అలాగే సీపీఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ప్రజల కంటే చింతా మోహన్‌కే బాగా తెలుసు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో కూడా పదేళ్ళుగా చూస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఈ దుస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించేసి మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారని చింతా మోహన్ అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యాక్టివ్‌ కావచ్చు. వైసీపి నుంచి కొంత మంది సీనియర్ నేతలు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకోవచ్చు. కానీ అంత మాత్రన్న ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 130/20 సీట్లు గెలిచేస్తుందని చింతా మోహన్ వంటి సీనియర్ రాజకీయ నాయకుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏపీలో వైసీపి, టిడిపి, జనసేనల బలాబలాలు, ప్రజలపై వాటి ప్రభావం చూస్తూ కూడా ఆయన ఈ మాట అనడం చాలా చిత్రంగా ఉంది.

ముఖ్యంగా రాజకీయాలలో చేతులు కాల్చుకొని మళ్ళీ బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవిని ఎగదోస్తుండటం ఆలోచించవలసిన విషయమే. ఆయన నిజంగా కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లయితే, ఇటువంటి సమయంలో రాష్ట్రంలో కాపుల ఓట్లను చీల్చి పవన్‌ కళ్యాణ్‌కి, జనసేనకి నష్టం కలిగించే ప్రయత్నం చేయకూడదు. కానీ చేస్తున్నారంటే అర్దం ఏమిటి?

అయినా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ పదేళ్ళుగా రాజకీయాలలో ఎదురుదెబ్బలు తింటూ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తుంటే, చిరంజీవి రాజకీయాలలోకి వస్తారని చింతా మోహన్ ఎలా అనుకున్నారో తెలీదు. ఒకవేళ చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టబోతున్న వైఎస్ షర్మిల ఒప్పుకుంటారా?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు చింతా మోహన్ వంటి కాంగ్రెస్‌ నేతలు ఎక్కడికి మాయం అయిపోయారు? గత ఐదేళ్ళుగా వైసీపి పాలనలో రాష్ట్రంలో అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్‌ నేతలు ఎక్కడ దాక్కొన్నారు?

జగన్మోహన్‌ రెడ్డి అమరావతిని కాదని మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తుంటే చింత మోహన్ ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలు, ప్రజల ఆత్మగౌరవం, వారి ఆకాంక్షలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎందుకు ఆదరించాలో చింతా మోహన్ చెప్పగలరా?

ADVERTISEMENT
Latest Stories