ఎప్పుడూ ఏదొక వివాదంతో మీడియాలో హల్చల్ చేయడం ఇటీవల కాలంలో పవన్ అభిమానులకు పరిపాటిగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పవన్ ఫ్యాన్స్ కు పోటీగా ప్రిన్స్ అభిమానులు కూడా రంగంలోకి దిగి వీరంగం సృష్టించారు. అభిమానానికి పుట్టినిల్లు అయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరంలో చోటు చేసుకున్న ఈ సంఘటన, మరోసారి అభిమాన ‘పైశాచికత్వాన్ని’ ప్రదర్శించేలా చేసింది.
[m9ad]
‘అభిమానం’ అన్న ఒకే ఒక్క పేరుతో పవన్ – మహేష్ అభిమానులు ఇద్దరూ తలలు పగిలేలా కొట్టుకుని, వారికున్న విజ్ఞతను చాటుకున్నారు. ఎంతగా ఈ ఉధృతి పెరిగింది అంటే… ఇరువురి హీరోల అభిమానులు రాళ్ళు, సోడాలు విసురుకునే స్థాయికి చేరుకోవడం విశేషం. ఇటీవల కాలంలో హీరోల కంటే అభిమానులే మీడియా వర్గాలలో హాట్ టాపిక్ అవుతుండడం విశేషం. ఇది ఎక్కడికి దారి తీస్తుందో గానీ, ‘అభిమానం’ ముసుగులో హీరోల ఫ్యాన్స్ చేస్తున్న కొన్ని పనులు సామాన్యులకు విరక్తిని కలిగిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో మహేష్ బాబు అభిమానులు గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగా, ఈ విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో భాగంగా భారీ బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా వదిలిన తారాజువ్వలు పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తాకి మంటలు చేలరేగాయి. దీంతో ఆగ్రహించిన పవన్ అభిమానులు వాగ్వాదానికి దిగారు. మరో వైపు ప్రిన్స్ ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో, వాగ్వివాదం ముదిరి పాకాన పడింది.
ఈ హంగామా చూసిన మరింత మంది ఇరు పక్షాల అభిమానులు అక్కడికి చేరుకోవడంతో, ఫైనల్ గా అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు రాళ్లు, సోడా సీసాలు విసురుకోవడంతో, పలువురు ఫ్యాన్స్ తీవ్ర గాయాల పాలయ్యారు. గతంలో సంఘటన తెలుసుకుని పోలీసులు ఈ అభిమాన గణాన్ని అదుపులో తీసుకుని, కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టారు. గతంలో ‘బాహుబలి’ సినిమా సమయంలో కూడా పవన్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ తో గొడవపడి రచ్చ రచ్చ చేసిన సందర్భాలు తెలిసిన విషయమే.


