ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక హామీలు ఇస్తుంటాయి. ఈ విషయంలో కూడా పోటాపోటీగా హామీలు ఇవ్వాల్సి వస్తుండటంతో అధికారంలోకి వచ్చాక అవే వాటి మెడకు గుదిబండల్లా మారుతున్నాయి.
జగన్ గత 5 ఏళ్ళలో అంతూపొంతూ లేకుండా అప్పులు చేసి మరీ సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూనే ఉన్నారు. ప్రజలకి ఉచితాలని ఓ వ్యసనంలా అలవాటు చేసి తమపైనే ఆధారపడి ఉండేలా చేసుకోగలిగితే తమకే ఓట్లు వేస్తారని, మళ్ళీ మళ్ళీ తామే అధికారంలోకి వస్తుంటామని జగన్ దురాలోచన చేశారు.
అయితే పధకాల పేరుతో ఎంత డబ్బు ముట్టజెప్పినా, ఎన్నికల సమయంలో మళ్ళీ డబ్బు వెదజల్లినా ప్రజలను ప్రలోభపెట్టలేరని 2024 శాసనసభ, లోక్సభ ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయంతో నిరూపితమైంది.
ప్రజలు రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో టిడిపి కూటమిని గెలిపించారు తప్ప ఎన్నికల హామీలను చూసి కాదని చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సిఎం చంద్రబాబు నాయుడు ఆగస్ట్ 15 నుంచి మూడు ఎన్నికల హామీలను అమలుచేయడానికి సిద్దపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి..
1. తల్లికి వందనం పధకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజుల్లో చాలా మంది ఒకరిద్దరు సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు కనుక దీనిని ఇద్దరికే
పరిమితం చేస్తే అమలుచేయడం కష్టం కాదు. కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్దులకు కూడా ఈ పధకాన్ని వర్తింపజేస్తామని చెప్పడం వలన ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది.
2. అన్నా క్యాంటీన్లు నిర్వహణ ప్రభుత్వానికి భారమే కానీ పేదల కడుపులు నింపడానికి చాలా అవసరమే. భోజనానికి నామ మాత్రంగా రూ.5 తీసుకుంటారు కనుక పూర్తి ఉచితంగా ఇస్తున్నట్లు కూడా కాదు. తిరుమలలో దాతల
సాయంతో నిత్యం లక్షలమందికి అన్నదానం జరుగుతోంది. అదేవిదంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణకి దాతలని సమకూర్చుకోగలిగితే ప్రభుత్వంపై ఈ భారం పడదు.
3. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ భారం మోయలేక, ఈ విషయం పైకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. అందుకు ఆర్టీసీకి నెలనెలా చెల్లించాల్సిన సొమ్ము ఆలస్యం అయితే
ఆర్టీసీ ఇబ్బంది పడుతోంది. కానీ ఈ సమస్యలన్నీ చూసిన తర్వాతే టిడిపి ఈ హామీని ఇచ్చింది. కనుక కొన్ని పరిమితులతో అమలుచేయవచ్చని వార్తలు వస్తున్నాయి. అది మంచి ఆలోచనే.




