తెలంగాణలో ఓ విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. శాసనసభ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డికి తన ప్రభుత్వం కూలిపోతుందని ఆందోళన చెందుతుంటే, బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చివేస్తాయని రేవంత్ రెడ్డి భయపడుతుంటే, కాంగ్రెస్, బీజేపీలు కలిసి తన పార్టీని ఖాళీ చేసేస్తాయని కేసీఆర్ ఆందోళన చెందుతుండటం విశేషం.
కనుక మూడు పార్టీలు మైండ్ గేమ్స్ ఆడుతూ తమ ప్రత్యర్ధులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. మూడు పార్టీలలో బీజేపీ ఒక్కటే గట్టున ఉంది కనుక అది చాలా ధీమాగా పావులు కదుపుతోంది. కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడం, ఆమెను ఈడీ, సీబీఐ ఉచ్చులో ఇంకా బిగించేస్తోంది.
దీంతో కేసీఆర్ కూతురు కోసం మోడీకి దాసోహం అంటున్నారని, తెలంగాణలో కనీసం 5 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకునేందుకు తోడ్పడేందుకు తెర వెనుక ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
ఇదివరకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర బిఆర్ఎస్ నేతలు, వారి సొంత మీడియా మోడీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు. వారి మీడియాలో కూడా మోడీకి వ్యతిరేకంగా ఏమీ రాయడం లేదు.
బిఆర్ఎస్ పార్టీలో ఈ మార్పు రాబోయే రోజుల్లో బీజేపీతో దోస్తీకి సంకేతాలని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీయే కూల్చేస్తుందన్నట్లు మాట్లాడుతున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారు కానీ నేనే ఆగమని చెప్పానని కేసీఆర్ గొప్పగా చెప్పుకొన్నారు కూడా.
కనుక లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొడతాయని రేవంత్ రెడ్డి కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే ‘నా ప్రభుత్వం, ఎమ్మెల్యేల జోలికి వస్తే తాట తీస్తాను… మాడి మసైపోతారంటూ’ ప్రతీ సభలో రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారనుకోవచ్చు.
తమ ప్రభుత్వానికి ప్రమాదం ముంచుకు వస్తున్నందున రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ఎన్నికలలోగానే వీలైనంత మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
కనుక తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని కేసీఆర్, మోడీ కలిసి కూల్చేస్తారా లేక కాంగ్రెస్, బీజేపీలు కలిసి బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కేసీఆర్ని నిర్వీర్యం చేస్తాయా?తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరిలో ఎవరు ఉంటే తమకు మంచిదని మోడీ భావిస్తున్నారు?అనే ప్రశ్నలకు లోక్సభ ఎన్నికల తర్వాత సమాధానాలు లభిస్తాయి.




