స్వపక్షం లోనే విపక్షం అన్నది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కొత్తేమి కాదు. తరాలు మారుతున్నా, నాయకులు వేరయినా కాంగ్రెస్ పార్టీ తల రాత మాత్రంమారడం లేదు.
ఇంకా అవే బూజు పట్టిన విధానాలు, అవే తరహా మూల సిద్ధాంతాలతో కాంగ్రెస్ రాజకీయం గడప లోపల, వీధి బయట అన్నట్టుగా సాగుతున్నాయి. నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఆదిపత్య పోరాటాలు రచ్చ చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు విందు ఇస్తూనే వసున్నాయి.
అలాగే నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు అందరు కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా ఆధిపత్య పోరును రుచి చూసి ఎదిగిన నాయకులే. అయితే తాజగా తెలంగాణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ లో ఇంటి పోరు రచ్చ కెక్కడానికి సిద్దమయ్యింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో రేవంత్ కు స్వపక్షంలో విపక్షం ఎదురయ్యింది. పదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడంతో పార్టీని అంటిపెట్టుకున్న చాలామంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి పదవి నుండి మంత్రి పదవుల వరకు వారి వారి స్థాయిని బట్టి ఆశించారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవరి ఊహకు అందనంతలా ముఖ్యమంత్రిగా రేవంత్ పేరును ఖరారు చేస్తూ మంత్రి వర్గాన్ని ప్రకటించింది. అలాగే రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా తనకు అవకాశం వస్తుందని భావించిన రాజగోపాల్ రెడ్డి కి కాంగ్రెస్ మొండి చెయ్యి చూపించింది.
ఇక దానితో అలక పాన్పు ఎక్కిన రాజగోపాల్ రాష్ట్ర స్థాయి నాయకత్వం మీద తన రుసరుసలు చూపిస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే మునుగోడు ప్రజల అభివృధికి నిధులు అడిగినా ముఖ్యమంత్రి అందుకు సుముఖత తెలపలేదంటూ ఒకసారి, అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్న రైతులకు తన మద్దతు తెలుపుతూ మరోసారి రేవంత్ పై ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఇప్పుడు కాళేశ్వరం అవినీతి అంటూ గత ప్రభుత్వ తప్పిదాలను, అవినీతి, అక్రమాల ను ఉద్దేశిస్తూ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయిన ఇటువంటి కీలక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తానూ నేటి నుంచి అసెంబ్లీకి రాబోను అంటూ ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులకు అండగా ఉండేందుకే తానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్న రాజగోపాల్, అమరవీరుల స్మారక చిహ్నం ను సందర్శించేందుకు ప్రత్యేకించి కారణం ఏమి లేదని అది తనకు దేవాలయం వంటిది అంటూ వెల్లడించారు.
అయితే రాజగోపాల్ అసెంబ్లీ బహిష్కరణ వెనుక ఉన్న కారణం వరద పర్యటన కాదని, అది రేవంత్ సర్కారులో తనకు మంత్రి పదవి దక్కపోవడంతో వచ్చిన అలక అని, కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా రాజకీయం కొత్తేమి కాదని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ గట్టిగానే నడుస్తుంది.





