ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రజలను ఫుట్ బాల్ మాదిరి ఆడుకుంటున్నారు రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ ఆనవాళ్లు చెరిపేయాలనే ఆలోచనతోనో., తన పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలతోనూ ఏపీ రాజధాని పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పటికి ఏపీ ప్రజలతో దోబూచులాడుతూనే ఉంది.
వైసీపీ ప్రభుత్వం కొన్నాళ్ళు ఒకటికాదు మూడన్నారు.., మూడు కాదు విశాఖే ఫైనల్ అంటూ మరి కొన్నాళ్ళు నెట్టుకెళ్ళారు..,తాజాగా మళ్ళీ హైద్రాబాద్ అంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. ఇలా ఏపీ ప్రజలను ఒక పక్క జగన్ కన్ ఫ్యుజ్ చేస్తుంటే ఇప్పుడు అసలు ఈ వివాదానికి, విభజనకి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు రాజధానిగా మరో ప్రాంతాన్ని సూచించారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే ఎంతమంది అడ్డొచ్చిన తిరుపతిని రాష్ట్ర రాజధాని చేసి తీరుతామని ఏపీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ చింత మోహన్ మరో వివాదాస్పద ప్రకటన చేసారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ధ్యేయంగా జగన్ పై విమర్శలతో రెచ్చిపోతున్న ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీ తరుపున ఇప్పటి వరకు రాజధాని పై ఒక నిర్దిష్ట ప్రకటన అంటూ ఏమి చేయలేదు.
అమరావతికి మద్దతుగా కాని వ్యతిరేకంగా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు షర్మిల. రాహుల్ ప్రధాని అయితే తన మొదటి సంతకం ఏపీ కి ప్రత్యేకహోదా మీదే అంటూ చెప్పుకొస్తున్న షర్మిల ఏపీ రాజధాని మీద ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇటువంటి సందర్భంలో చింత మోహన్ ‘తిరుపతి’ రాజధాని అంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీని మరోసారి ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టనుందా..?
ఇలా రోజుకో పార్టీ, పూటకో నాయకుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలను రాజధానులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చనున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరు చేసిన కర్మ ఫలమో తెలియదు కానీ ఏపీ రాష్ట్రానికి రాజధాని అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉన్న కర్నూల్ ను హైద్రాబాద్ గా మార్చి అప్పుడు ఆంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించని ప్రభుత్వాలు ఇప్పటికి తమ తీరు మార్చుకోవడం లేదు.




