2017 అక్టోబర్ లో భూమి అంతరించి పోతుందని సరికొత్త ప్రచారం ఊపందుకుంటోంది. 2003 నుంచి పలు సందర్భాల్లో భూమి అంతరించిపోతుందని ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా 12-12-2012లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనన్న విషయం చాలా సందర్భాలలో తేటతెల్లమైంది. అయితే తాజాగా 2017 అక్టోబర్ లో భూమి అంతరించిపోతుందనే విషయాన్ని డేవిడ్ మీడే అనే రచయిత ‘ప్లానెట్ టెన్ – ది 2017 అరైవల్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
కుట్ర సిద్ధాంత కర్తలుగా పేర్కొనే కొందరు, వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు అనే గ్రహం విచ్ఛిన్నం చేసిందని, ఇది సౌరవ్యవస్థలో పదో గ్రహమని చెబుతున్నారు. ఇప్పుడిది భూమికి దక్షిణ ధ్రువం వైపు నుంచి దూసుకొస్తోందని చెబుతున్నారు. ఇది ఒక్కటే రావడం లేదని, తన లాంటి మరో మరో ఏడు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకొని వస్తోందని వారు చెబుతున్నారు. గురుత్వాకర్షణ ప్రభావం నుంచి, సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం 2017 అక్టోబర్ లో భూమిని తాకే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేందుకు సరిపడే సరైన ఆధారాలు లేవని డేవిడ్ మీడే వెల్లడించారు.
ఈ నిబిరు గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం కష్టమని ఆయన తెలిపారు. అదే సమయంలో దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తే ఇది ఏ దిశగా వచ్చి భూమిని ఢీ కొడుతుందో గుర్తించేందుకు వీలు పడుతుందని చెప్పారు. డేవిడ్ మీడే దీనికి శాస్త్రీయ ఆదారాలు జోడించి వివరించగా, మతబోధకులు తమ వాదన కూడా వినిపిస్తున్నారు. బైబిల్ లో కూడా ఈ విషయం ఉందని తమ వాదన వినిపించడం ప్రారంభించారు.
ఇదే సమయంలో అసలు నిబిరు అనే గ్రహం సౌర కుటుంబంలోనే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేసే కథనాలుగా నాసా కొట్టిపడేసింది. ఇదే సమయంలో ప్రపంచం అంతరించి పోతుందని 2003, 2012, 2015లో ఎన్నో పుకార్లు ప్రచారమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు ఆకర్షించడానికి పుట్టే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయని కొట్టిపడేస్తున్నారు.



