ఒకప్పుడు తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, బామ్మ వంటి వారు పిల్లలకు ఇలాంటి కథలు చెప్తుండేవారు. బాల్యంలో విన్న ఆ కథలు, పాత్రలు వారు పెరిగి పెద్దయ్యాక కూడా ఏదో ఒక సందర్భంలో ప్రభావం చూపుతూనే ఉంటాయి.
కానీ ఇప్పుడు సమాజంలో స్పీడ్ పెరిగిపోయింది. పిల్లల కోసం సమయం కేటాయించడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు. పైగా పిల్లల భవిష్యత్ కోసమని చిన్నప్పుడే కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు.
అక్కడ వారికి బాల్యంలో నేర్పించాల్సిన విషయాలను నేర్పించకపోగా వారి ఆలోచనా ధోరణిని, ప్రవర్తనను, జీవనశైలిని పూర్తిగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా వారి మాతృభాషను, మన సంస్కృతీ సంప్రదాయాలను ఆ దశలో అక్కడే సమూలంగా తుడిచిపెట్టేస్తున్నారు.
మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వివిధ కారణాలతో చిన్నప్పుడే హాస్టళ్లలో వేస్తున్నారు. అక్కడ కూడా వారి చిన్నారి మనసులు విధ్వంసానికి గురవుతున్నాయి.
బాల్యంలో బలమైన పునాది వేయాల్సిన తరుణంలో అందరూ కలిసి వారికి అసలు పునాదే లేని జీవితాలు నిర్మిస్తున్నారు. కనుక పురాణాలు, పాత్రలు, వాటి ఔచిత్యాల మాట దేవుడెరుగు.
కనీసం బంధువులతో, చివరికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కూడా బలమైన అనుబంధం లేకుండా పోతోంది. పెరిగి పెద్దయ్యాక ఆఫీసుల్లో, సోషల్ మీడియాలో కోల్పోయిన స్నేహాలను, ప్రేమను వెతుక్కుంటున్నారు.
సమాజంలో ఈ మార్పు వలన ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ చుట్టూ అందరూ ఉన్నా మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు.
పిల్లల గొప్ప భవిష్యత్ కోసం ఒకప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాల పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో వృద్ధాప్యంలో ఉన్నవారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోతుంది.
కనుక మనుమలను, మునిమనుమలను చేరదీసి పురాణాలు, కథలు, వాటిలో పాత్రల ఔచిత్యాల గురించి చెప్పి వారికి బలమైన పునాది వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ ముందే చెప్పుకున్నట్లు పిల్లల ఉజ్వల భవిష్యత్ అంటే బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం, పెద్ద ప్యాకేజ్, ఇల్లు, వాహనాలు వగైరా సంపాదించుకోవడమే అన్న భావనతో చిన్నారులను కార్పొరేట్ స్కూళ్లకు అప్పగించేస్తున్నారు.
అక్కడ శాస్త్రీయంగా వారికి రోజూ బ్రెయిన్వాష్ జరుగుతున్నప్పుడు వారి చిన్నారి మనసుల్లోకి నైతిక విలువలు, బంధాలు, సంస్కృతీ సంప్రదాయాలు, దేవుడు, భక్తి వంటివి జొప్పించడం చాలా కష్టం.
కనుక మార్పు ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉండాలో అర్థమవుతూనే ఉంది. ఆ మార్పు అసాధ్యమైతే పిల్లల నుంచి ఈ నైతిక విలువలు వగైరా ఆశించడం కూడా అత్యాశే అవుతుంది కదా?







